బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం బలపడనుంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల పరిధిలో శనివారానికి (ఆగస్టు 29, 2026) ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల కొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన…

అల్పపీడన ప్రభావంతో శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాల సమయంలో ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ వాతావరణ బులెటిన్
ఇక ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆగస్టు 28, 29 తేదీల్లో రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. అయితే ఎలాంటి తీవ్రమైన ముప్పు హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.