రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన వారికి యాంటీ డోట్ ఇంజెక్షన్లు!
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఘటనలో పలువురు ఇంకా చికిత్స పొందుతున్నారు. వారికి యాంటీ డోట్ ఇంజెక్షన్లు ఇవ్వాలని వైద్యలు చూస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం కల్తీ పాలు తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తిన రోగులకు యాంటీ డోట్ కొనుగోలు చేసింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఈ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేవని, ఆంధ్రప్రదేశ్ వెలుపలి వైద్య సంస్థల ద్వారా వీటిని సేకరిస్తున్నామని తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి రాజు సలహా ఆధారంగా చికిత్స ప్రోటోకాల్లో భాగంగా రోగులకు విరుగుడు మందులు ఇస్తారు.

నివాసితులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే సమీపంలోని వైద్య శిబిరాన్ని సందర్శించాలని కలెక్టర్ సూచించారు. వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 9494060060 కు కూడా కాల్ చేయవచ్చని చెప్పారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, బాధిత వారికి అవసరమైన అన్ని వైద్య సహాయం అందేలా చూస్తుందని ఆమె అన్నారు.
అయితే ఈ యాంటీ డోట్ ఇంజెక్షన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితుల చికిత్స కోసం యాంటీడోట్ తెప్పించినట్టుగా అధికారులు చెబుతున్నారు. కల్తీ పాల ఘటనలో సుమారు 15 మంది వరుక బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఇద్దరు, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్, ఏడుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే పాలలో ఎలాంటి పదార్థాలు కలిశాయో తెలియాల్సి ఉంది. ఆ తర్వాత యాంటీ డోట్ ఇంజెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని సీనియర్ నెఫ్రాలిజిస్ట్ రవిరాజ్ సూచనల మేరకు కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపడేందుకు ప్రత్యేకంగా మందులు తెప్పిస్తున్నారు. ఇక్కడ అందుబాటులో లేని మందులను చెన్నై, ముంబయి నుంచి తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ ఫామ్ల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలలో యూరియా, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలు కలుస్తున్నాయా అనే కోణంలో తనిఖీలు చేసి, పలు పాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంపూర్ణ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఘటనకు గల కారణాలను విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. కల్తీ లేదా ఇతర లోపాలపై కఠిన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

E-Paper












