Andhrapradesh : పాల కేంద్రాలపై ఫోకస్..! నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాల విక్రయ, నిల్వ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ ఫామ్ల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలలో యూరియా, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలు కలుస్తున్నాయా అనే కోణంలో తనిఖీలు చేసి, పలు పాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాల వర్తకులు, పాల తయారీదారులు, నిల్వదారులు, హోల్ సేల్ వర్తకుల నుంచి నమూనాల సేకరిస్తామని ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి వెల్లడించారు. వారివద్ద ఆధీకృత లైసెన్సులు ఉన్నాయా…? లేవా అన్న వాటిపై తనిఖీల్లో గుర్తించనున్నామని వెల్లడించారు.
కొనసాగుతున్న చికిత్స…
మరోవైపు రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనకు సంబంధించి ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర్య పాండియన్ వెల్లడించారు. పాలలో యూరియా ఆనవాళ్ల గురించి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఒకవేళ పాలలో యూరియా కలిసినట్లయితే వెంటనే కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయం దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. యూరియా కలిసిన పాలను దీర్ఘకాలం సేవిస్తేనే కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, మూత్రం రాకుండా స్తంభించడంవంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్పారని తెలిపారు.
బాధితుల ఇళ్లల్లో ఉపయోగించగా మిగిలిన పెరుగు, నెయ్యి, వెనిగార్, పాల నమూనాలను 10 వరకు సేకరించి వాటిని పరీక్ష నిమిత్తం హైదరాబాద్, కాకినాడలోని జాతీయ ఆహార భద్రత సంస గుర్తించిన ప్రయోగశాలలకు పంపించామని తెలిపారు విక్రేత విక్రయించిన పాలు దొరకలేదని, అయితే పెరుగు, పన్నీర్, నెయ్యి, మీగడ నమూనాలు సేకరించామన్నారు నీటి ఫలితాలు బుధవారం నుంచి శనివారం మధ్య దశల వారీగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు నీటి ఆధారంగానే పాల కల్తీకి సంబంధించి స్పష్టత వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
రాజమహేంద్రవరం ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 మంది పలు అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు వెంటిలేటర్లు, ఇద్దరు డయాలసిస్, మరో ముగ్గురు వెంటిలేటర్-డయాలసిస్ పై ఉన్నారని వెల్లడించారు. మరో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేక మందులు….
బాధితుల ఆరోగ్య పరిస్థితిని సీనియర్ నెఫ్రాలిజిస్ట్ రవిరాజ్ సూచనల మేరకు కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపడేందుకు ప్రత్యేకంగా మందులు తెప్పిస్తున్నారు. ఇక్కడ అందుబాటులో లేని మందులను చెన్నై, ముంబయి నుంచి తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

