రాఖీ పౌర్ణమి పండుగతో పాటు వారాంతపు సెలవుల (వీకెండ్) కారణంగా ప్రయాణికుల నుంచి వచ్చే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విశాఖపట్నం - విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రత్యేక 'జన సాధారణ్' ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026 ఆగస్టు 28వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు మొత్తం 3 ట్రిప్పుల పాటు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక సర్వీసులు ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 3 రోజులు (3 ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ రైలులో 10 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో పాటు 2 లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్లు (SLR) కలిపి మొత్తం 12 ICF కోచ్లను ఏర్పాటు చేశారు.
- విశాఖపట్నం - విజయవాడ (రైలు నంబర్ 07215) : ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఉదయం 08:30 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 16:00 గంటలకు (4:00 PM) విజయవాడ చేరుకుంటుంది.
- విజయవాడ - విశాఖపట్నం (రైలు నంబర్ 07216) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు విజయవాడలో సాయంత్రం 19:00 గంటలకు (7:00 PM) బయలుదేరి… అర్ధరాత్రి దాటాక 00:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
రైళ్లు ఆగే ప్రధాన స్టేషన్లు…
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లకు పలు ముఖ్యమైన స్టేషన్లలో నిలుపుదల కల్పించారు. దువ్వాడ, అనకాపల్లి, నర్సీపట్నం రోడ్, తుని, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. పండగ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే కోరింది.