ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు విమానయాన రవాణాలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న నూతన విమానాశ్రయం త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ఎయిర్పోర్ట్ ద్వారా షెడ్యూల్ విమాన సర్వీసులు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.

జీఎమ్ఆర్ సంస్థ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అత్యాధునిక వసతులతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించింది. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" పేరును ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ ప్రకటించింది. గతేడాది 2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలని నిర్ణయించింది. తాజాగా ఆ ప్రతిపాదనకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదముద్ర వేసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న తరుణంలో, ప్రస్తుతం సేవలు అందిస్తున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ (ఐఎన్ఎస్ డేగా - సివిల్ ఎన్క్లేవ్) నుంచి సాధారణ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం రాబోయే 30 సంవత్సరాల పాటు విశాఖ విమానాశ్రయం నుంచి ఎటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడపబడవు.
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులకు, విమానాలకు విశాఖ ఎయిర్పోర్ట్ వేదికగా నిలవనుంది. ఇప్పటివరకు విశాఖపట్నం విమానాశ్రయానికి చెందిన ఐఏటీఏ కోడ్ VTZను ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి కొత్తగా ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేస్తారు.
జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విశాఖ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి మినహాయింపు ఉంటుంది. భారత వైమానిక దళం, రక్షణ దళాలు, పోలీసు విమానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ, లీజ్డ్ ఎయిర్క్రాఫ్ట్లు విశాఖ నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి.
{{/usCountry}}జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విశాఖ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి మినహాయింపు ఉంటుంది. భారత వైమానిక దళం, రక్షణ దళాలు, పోలీసు విమానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ, లీజ్డ్ ఎయిర్క్రాఫ్ట్లు విశాఖ నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి.
{{/usCountry}}నాన్-షెడ్యూల్డ్ ప్రాతిపదికన నడిచే వాణిజ్య, చార్టర్డ్ విమానాల సేవలు విశాఖ ఎయిర్పోర్ట్లో యథావిధిగా కొనసాగుతాయి. విశాఖ ప్రాంత ప్రయాణికులు ఆగస్టు 17 నుంచి తమ విమాన ప్రయాణాలను భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖ, విజయనగరం పరిసర ప్రాంతాల ఆర్థిక, పర్యాటక రంగానికి ఈ కొత్త ఎయిర్పోర్ట్ మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.