SCR Weekly Express : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... తిరుపతి - అకోలా మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్, పూర్తి షెడ్యూల్
Tirupati Akola Weekly Express : తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి - అకోలా మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రకటించింది. మే మొదటి వారం నుంచి ఈ ట్రైన్ పట్టాలెక్కనుంది.
Tirupati Akola Weekly Express : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ…. వాటిని శాశ్వత వీక్లీ ఎక్స్ప్రెస్లుగా మార్చింది. ఇందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మే మొదటి వారం నుంచి రైలు నంబర్లు 17429/17430 కొత్త టైమ్ టేబుల్తో అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త రైలు కేవలం రెండు నగరాలను కలపడమే కాకుండా…. రాయలసీమ, తెలంగాణలోని ప్రధాన పట్టణాలను మహారాష్ట్రలోని కీలక కేంద్రాలతో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ రైలు పెద్ద ఊరటనివ్వనుంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్, నిజామాబాద్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
కొత్త సర్వీసుల వివరాలు ఇవే….
అకోలా నుంచి తిరుపతికి వచ్చే రైలు (ట్రైన్ నంబర్ 17430) మే 3వ తేదీ నుంచి తన సేవలను ప్రారంభించనుంది. ఇది ప్రతి ఆదివారం ఉదయం 08:10 గంటలకు అకోలాలో బయలుదేరి….. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 08:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి నుంచి అకోలా వెళ్లే రైలు (నంబర్ 17429) మే 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:25 గంటలకు తిరుపతిలో బయలుదేరి…. శనివారం మధ్యాహ్నం 14:00 గంటలకు అకోలా చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు ఇవే….
ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు….. పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్ , కర్నూల్ సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్ తో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయి.
ఈ రైలులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (SL), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను ఏర్పాటు చేశారు. గతంలో 07605/07606 నంబర్లతో నడిచిన ఈ స్పెషల్ ట్రైన్లను ఇప్పుడు పర్మనెంట్ వీక్లీ ఎక్స్ప్రెస్లుగా మార్చడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

