...
...
Next Story

గాజువాకలో ప్రియురాలిని ముక్కలు చేసిన ఘటనలో సంచలన నిజాలు.. డేటింగ్ యాప్ పరిచయం

Gajuwaka Murder Case : విశాఖ గాజువాకలో ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటనలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడికి బాధితురాలు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది.

Published on: Mar 31, 2026, 14:29:23 IST
Advertisement

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.వి. నగర్‌లోని తన ఇంట్లో నేవీ అధికారి.. ప్రియురాలిని హత్య చేసిన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధం కలిగిన మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ హత్య మార్చి 29న జరిగినప్పటికీ.. నిందితుడైన చింతడ రవీంద్ర(29) సోమవారం గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతం, సంజీవయ్య కాలనీకి చెందిన పొలిపల్లి మౌనిక (31)గా గుర్తించారు.

గాజువాక హత్య కేసు
గాజువాక హత్య కేసు

రవీంద్ర, మౌనికలు 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణ ఉప-విభాగం) వై. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. రవీంద్ర 2024లో వివాహం చేసుకున్నప్పటికీ.. మౌనికతో తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. రవీంద్ర భార్య ప్రసవం కోసం విజయనగరంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే రవీంద్ర ఈ హత్యకు పథకం రచించి ఉంటాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

తమ వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని మౌనిక తనను బెదిరిస్తోందని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. ఆదివారం ఉదయం మౌనికను రవీంద్ర తన ఫ్లాట్‌కు పిలిచాడు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన అనంతరం, మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో రవీంద్ర మౌనికను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.

నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగా రవీంద్ర మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అందులో కొంత భాగాన్ని తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచాడు. తల, చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టాడు రవీంద్ర. అలా మిగిలిన భాగాలను సంచిలో కుక్కాడు.

పోలీసులు ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భాగాలను ఒక ట్రాలీ బ్యాగులో, గోనె సంచుల్లో కుక్కి ఉంచినట్లు గుర్తించారు. కాల్చివేసిన శరీర భాగాల అవశేషాలను పోలీసులు పరిశీలించారు. గాజువాక పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

ఇదిలా ఉండగా, మృతురాలి తల్లిదండ్రులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.

వీరి పరిచయానికి డేటింగ్ యాప్ ముఖ్యమైన కారణం. 2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్నాడు నేవీ అధికారి రవీంద్ర. 2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe