డేటింగ్ యాప్ ఉచ్చు: యువతితో డేట్కు వెళ్తే.. బంధించి, చితకబాది రూ. 7 లక్షలు దోచుకున్నారు
ఢిల్లీలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని నమ్మి వెళ్లిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. ఆమె ముఠా సభ్యులు అతడిని కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడి రూ. 7 లక్షలు వసూలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకునే వారు తస్మాత్ జాగ్రత్త! అందమైన మాటలతో ఊరించి, డేట్కు పిలిచి నిలువునా ముంచేసే ముఠాలు నగరాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా వెలుగుచూసిన ఒక హారర్ ఉదంతం చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఒక యువతిని నమ్మి డేట్కు వెళ్లిన 34 ఏళ్ల వ్యక్తిని ఆమె మిత్రబృందం కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసి ఏకంగా రూ. 7 లక్షలు దోచుకున్నారు.

అసలేం జరిగిందంటే?
ఆగ్నేయ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్కు చెందిన బాధితుడు ఒక డేటింగ్ యాప్ ద్వారా హర్లీన్ కౌర్ అలియాస్ జెన్నీ (20) అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ముదిరి గత మంగళవారం సాయంత్రం ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె మాటలు నమ్మిన బాధితుడు నెహ్రూ ప్లేస్కు చేరుకున్నాడు. రాత్రి 7 గంటల సమయంలో అతను అక్కడ వేచి ఉండగా, హఠాత్తుగా రెండు కార్లు అతడిని సమీపించాయి. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి, బాధితుడిని బలవంతంగా కారులోకి నెట్టేశారు.
రాత్రంతా నరకం.. రూ. 7 లక్షల వసూలు
కారులో బాధితుడిపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారు. గొంతును గట్టిగా నొక్కడంతో అతను స్పృహ కోల్పోయాడు. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి అతడిని బెదిరించి యూపీఐ (UPI), ఏటీఎం విత్డ్రాయల్స్, క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా దాదాపు రూ. 7 లక్షలు బదిలీ చేయించుకున్నారు. దక్షిణ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో రాత్రంతా కారులో తిప్పుతూ నరకం చూపించిన నిందితులు, మరుసటి రోజు బుధవారం ఉదయం 9:30 గంటలకు మళ్ళీ నెహ్రూ ప్లేస్ వద్దే వదిలేసి పరారయ్యారు.
పోలీసుల వేట.. ఐదుగురి అరెస్ట్
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాల్కాజీ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు బదిలీ చేసిన ఆన్లైన్ పేమెంట్ వివరాల ఆధారంగా నిందితుల మొబైల్ నంబర్లను ట్రాక్ చేశారు. ఈ కేసులో యువతి జెన్నీతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో నవ్ జోత్ (30-జిమ్ ట్రైనర్), సంజయ్ (28-వెటర్నరీ విద్యార్థి), రిషబ్ (25-క్యాబ్ డ్రైవర్), సాహిల్ చౌహాన్ ఉన్నారు.
నేరాల వెనుక పక్కా ప్లాన్
డీసీపీ హేమంత్ తివారీ కథనం ప్రకారం.. జెన్నీ ప్రధానంగా డేటింగ్ యాప్ల ద్వారా అమాయక వ్యక్తులను వల వేస్తుంది. వారిని ఒక చోటుకు పిలిచి, తన అనుచరులతో కలిసి దోచుకోవడం వీరికి అలవాటు. వీరికి గతంలో నేర చరిత్ర లేకపోయినప్పటికీ, విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఇదే తరహాలో ఒక డాక్టర్ సహా మరో ఇద్దరు వ్యక్తులను కూడా తాము దోచుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 309 (దోపిడీ), 140 (కిడ్నాప్) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: డేటింగ్ యాప్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?
జవాబు: డేటింగ్ యాప్లలో కొత్తగా పరిచయమైన వారిని కలిసేటప్పుడు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవాలి. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకూడదు.
ప్రశ్న: ఈ తరహా కిడ్నాప్, దోపిడీకి గురైతే ఎవరిని సంప్రదించాలి?
జవాబు: వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి లేదా డయల్ 112 అత్యవసర నంబర్కు సమాచారం అందించాలి. అలాగే బ్యాంక్ లావాదేవీలను నిలిపివేసే ప్రయత్నం చేయాలి.
ప్రశ్న: ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా నిందితులను పట్టుకోవడం సాధ్యమేనా?
జవాబు: అవును. యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరిగినప్పుడు ఆ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు నిందితులను సులభంగా గుర్తిస్తారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


