...
...
Next Story

Vijayawada Railway Station : విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ - రూ.200 కే ఏసీ గదులు! బుకింగ్ , ఫీచర్లు ఇవే

Vijayawada Railway Station Sleeping Pods : విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అత్యాధునిక స్లీపింగ్ పాడ్స్ వసతి అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.200 ప్రారంభ ధరతో లభించే సురక్షితమైన, పరిశుభ్రమైన ఏసీ క్యాబిన్లు అందుబాటులోకి వచ్చాయి.

Published on: Jul 12, 2026 01:23 PM IST
Advertisement

Vijayawada Railway Station Sleeping Pods : రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ కీలక అడుగు వేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో సరికొత్త 'స్లీపింగ్ పాడ్స్' (Sleeping Pods) వసతిని శనివారం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు, కనెక్టింగ్ రైళ్ల కోసం వేచి చూసే వారు, రాత్రి వేళల్లో స్టేషన్‌లో గడపాల్సిన భక్తులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్
విజయవాడ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్

స్టేషన్ వెలుపలికి వెళ్లకుండానే, సురక్షితమైన వాతావరణంలో, అత్యంత తక్కువ ఖర్చుతో విశ్రాంతి తీసుకునేందుకు రైల్వే శాఖ ఈ ఆధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అత్యాధునిక వసతులు…

విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై ఈ స్లీపింగ్ పాడ్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు పెద్దపీట వేస్తూ దీని లోపలి భాగాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. మహిళా ప్రయాణికుల రక్షణ, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా 14 పాడ్స్‌ను కేటాయించారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎలాంటి భయం లేకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా 3 ఫ్యామిలీ క్యాబిన్లను కూడా డిజైన్ చేశారు.

రూ.200 లకే ఏసీ సదుపాయం.. ఫీచర్లు ఇవే!

సాధారణ ప్రయాణికులకు కూడా భారం కాకుండా ఉండేలా దీని ధరలను నిర్ణయించారు. మూడు గంటల సమయానికి కేవలం రూ.200, అలాగే 12 గంటల సమయానికి రూ.400 చొప్పున రుసుము వసూలు చేస్తారు. ప్రతి స్లీపింగ్ పాడ్ సుమారు 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడవుతో ఉంటుంది.

  • సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ (AC) వ్యవస్థ.
  • వ్యక్తిగత సామాన్లు దాచుకోవడానికి లాకర్ సదుపాయం.
  • హై-స్పీడ్ ఉచిత వై-ఫై (Wi-Fi) కనెక్టివిటీ.
  • మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు.
  • సౌకర్యవంతమైన బెడ్డింగ్, బెడ్‌షీట్లు.
  • వీటితో పాటు అదనపు చెల్లింపులపై వేడి నీరు, ప్యాక్ చేసిన ఆహారం, తాగునీరు, టీ, కాఫీ వంటి పానీయాల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.

బుకింగ్ ఎలా చేసుకోవాలంటే…?

"విజయవాడ రైల్వే స్టేషన్ గుండా ప్రతి నెలా లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారిలో చాలా మందికి ప్రయాణ మధ్యలో సురక్షితమైన, పరిశుభ్రమైన విశ్రాంతి స్థలం అవసరం అవుతుంది. భక్తులు, ప్రయాణికుల ఈ అవసరాన్ని తీర్చడానికే తక్కువ ధరలో ఈ ఆధునిక స్లీపింగ్ పాడ్స్ తీసుకొచ్చాం," అని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా తెలిపారు.

గుంటూరు, విశాఖపట్నం తర్వాత ఈ తరహా సదుపాయాన్ని తెచ్చిన మూడో స్టేషన్‌గా విజయవాడ నిలిచింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వల్పకాలిక వసతి గదులకు పెరుగుతున్న డిమాండ్‌ను విశ్లేషించిన తర్వాతే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

రైల్వే యేతర ఆదాయ మార్గాల (NFR) కింద ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. దీని ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.71 లక్షల లైసెన్స్ ఫీజు చొప్పున….. రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.3.55 కోట్ల ఆదాయం సమకూరనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe