Srisailam Water Level : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటి ప్రవాహం స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం నమోదైన వివరాల ప్రకారం జలాశయానికి 13,544 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతోంది.
నీటిమట్టం వివరాలు ఇలా…

వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 871.801 అడుగులకు చేరింది. ఇక జలాశయంలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 149.419 టీఎంసీలుగా నమోదైనట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీశైలం నుంచి దిగువకు ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కాలువల ద్వారా 13,111 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాల సూచనలు ఉన్నందున రానున్న గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 15,582 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 536.201(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 180.503(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో 15,582 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి.