AP DPT TD Vaccination Drive : ఆగస్టు 3 నుంచి డీపీటీ టీకా కార్యక్రమం - విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు
AP DPT TD Vaccination Drive 2026 : ఏపీలో ఆగస్టు 3 నుంచి 8 వరకు డీపీటీ టీకా కార్యక్రమం మొదలవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక టీకా శిబిరాలను ఏర్పాటు చేస్తారు.
AP DPT TD Vaccination Drive 2026 : రాష్ట్రంలో పిల్లలు, కౌమార దశలోని యువత సమగ్ర ఆరోగ్య రక్షణే లక్ష్యంగా వైద్యా ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గొంతువాపు (డిఫ్తీరియా), కోరింత దగ్గు (పెర్టురిస్), ధనుర్వాతం (టెటానస్) వంటి అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా (డీపీటీ, టీడీ) డ్రైవ్ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆపరేషన్ సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ వివరాలను వెల్లడించారు.
సాధారణ సార్వత్రిక టీకా కార్యక్రమాల్లో (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్) రకరకాల కారణాల వల్ల వ్యాక్సిన్లు వేసుకోలేకపోయిన పిల్లలను గుర్తించి, వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక టీకా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. చదువుకుంటున్న విద్యార్థులతో పాటు, బడికి వెళ్లని అర్హులైన పిల్లలను కూడా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్ల ద్వారా ముందస్తుగా గుర్తించి ఉచితంగా టీకాలు వేయనున్నారు.
వయస్సు వారీగా టీకా నిబంధనలు:
- ఐదేళ్లు నిండిన పిల్లలకు డీపీటీ (DPT - Diphtheria, Pertussis, Tetanus) రెండవ బూస్టర్ డోస్ ఇస్తారు.
- 10 మరియు 16 సంవత్సరాల వయస్సు ఉన్న కౌమార దశ యువతకు టీడీ (TD - Tetanus, Diphtheria) వ్యాక్సిన్ అందిస్తారు.
- ఈ టీకాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఆయా ప్రాణాంతక ఇన్ఫెక్షన్లపై పోరాడే రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) గణనీయంగా పెరుగుతుంది.
- వ్యాధి సంక్రమణను అడ్డుకోవడమే కాకుండా, ముందస్తు నివారణ ద్వారా మరణాల ముప్పును పూర్తిగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా కార్యక్రమానికి ఏమాత్రం కొరత లేకుండా అవసరమైన వ్యాక్సిన్లు, సిరంజీలు, అనుబంధ సామగ్రిని ముందస్తుగానే ఆయా జిల్లాలకు చేరవేయాలని కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు.
ఎలాంటి అత్యవసర ప్రతికూల పరిస్థితులనైనా తక్షణమే ఎదుర్కొనేందుకు ప్రతి టీకా కేంద్రం వద్ద "అనాఫైలాక్సిస్ కిట్"ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. అలాగే, ప్రతీ వాక్సినేషన్ కేంద్రాన్ని సమీపంలోని ఏఈఎఫ్ఐ నిర్వహణ కేంద్రంతో ప్రాథమికంగా అనుసంధానించాలని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

