తిరుమల : వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణఆంజనేయులు తెప్పపై విహారం చేశారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
శ్రీవారి తెప్పోత్సవాల చరిత్ర
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే ఐదు రోజుల తెప్పోత్సవాలను “తెప్ప తిరునాళ్లు”గా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ.
ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి–మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి – వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది.
క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ, 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి.
తిరుమలలో నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

