వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా ? : సుప్రీం కోర్టు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అవసరం ఉంటే విచారణ ఎవరెవరిని చేయాలో తెలపాలని పేర్కొంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారా అని సీబీఐని అడిగింది అత్యున్నత న్యాయస్థానం. దర్యాప్తులో భాగంగా ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఏయే అంశాల మీద తదుపరి విచారణ అవసరమో.. చెప్పాలని తెలిపింది.
సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలను వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే.. ట్రయల్ కోర్టుకు వెళ్లామని చెప్పారు. అక్కడ తదుపరి దర్యాప్తు అవసరం అని పిటిషన్లో పేర్కొన్న అంశాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
'పిటిషన్లో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు. అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. వివేకా కేసును పాక్షికంగా దర్యాప్తునకు అనుమతించడం ఏంటి?' అని న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు.
వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారా అని దర్మాసనం అడిగింది. ఏ అంశాల మీద తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారో చెప్పాలని తెలిపింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలనుకుంటున్నారో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారని అడిగింది. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించింది. సీబీఐ ఈ విషయంలో తన వైఖరి తెలపాలని వెల్లడించింది.
ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారణ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను అడిగి చెప్తామని, దీనికి రెండు వారాలా సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

E-Paper












