వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా ? : సుప్రీం కోర్టు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అవసరం ఉంటే విచారణ ఎవరెవరిని చేయాలో తెలపాలని పేర్కొంది.

Published on: Jan 20, 2026, 12:38:25 IST
By , Delhi
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారా అని సీబీఐని అడిగింది అత్యున్నత న్యాయస్థానం. దర్యాప్తులో భాగంగా ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఏయే అంశాల మీద తదుపరి విచారణ అవసరమో.. చెప్పాలని తెలిపింది.

సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలను వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే.. ట్రయల్ కోర్టుకు వెళ్లామని చెప్పారు. అక్కడ తదుపరి దర్యాప్తు అవసరం అని పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.

'పిటిషన్‌లో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు. అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. వివేకా కేసును పాక్షికంగా దర్యాప్తునకు అనుమతించడం ఏంటి?' అని న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు.

వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారా అని దర్మాసనం అడిగింది. ఏ అంశాల మీద తదుపరి విచారణ అవసరం అని భావిస్తున్నారో చెప్పాలని తెలిపింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలనుకుంటున్నారో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారని అడిగింది. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించింది. సీబీఐ ఈ విషయంలో తన వైఖరి తెలపాలని వెల్లడించింది.

ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారణ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను అడిగి చెప్తామని, దీనికి రెండు వారాలా సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More