ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదు.. ప్రైవేట్ వాహనాల్లో జాగ్రత్త : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మరోవైపు సంక్రాంతికి అదనపు బస్సు ఛార్జీలు లేవని ప్రకటించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో కూడా ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని అన్నారు.
అదే విధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని తెలిపారు.
సంక్రాంతికి ఊర్లకు వెళ్తుండటంతో రహదారులపై ట్రాఫిక్ భారీగా ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో తెల్లవారుజాము నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సొంత గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు.
కృష్ణ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపే మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి మొత్తం 8,432 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. 6,000 బస్సు సర్వీసులు ఆంధ్రప్రదేశ్లోని డిమాండ్ను తీర్చడానికి పరిమితం చేశారు. అయితే 2,432 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానించేందుకు ఏర్పాటు అయ్యాయి.
ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రత్యేకంగా నడుస్తున్నప్పటికీ.. రద్దీ రోజులలో డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీని వలన చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ రవాణాను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. విజయవాడ బస్ స్టేషన్ నుండి అధిక సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు.

E-Paper












