...
...
Next Story

తిరుమలలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర - వైభవంగా పురుశైవారి తోట ఉత్సవం!

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొర పురస్కరించుకుని శుక్రవారం పురుశైవారి తోట ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉభయ జీయర్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published on: Aug 14, 2026, 20:10:22 IST
Advertisement

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని శుక్రవారం పురుశైవారి తోట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

పురాణ విశేషాలు…

తిరుమలలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర
తిరుమలలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర

వైష్ణవ సాంప్రదాయం మరియు పురాణాల ప్రకారం, పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్)కు చెందిన పవిత్ర తులసీవనంలో భూదేవి అంశగా శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు ఆవిర్భవించిన ఈ పవిత్ర దివ్య సమయాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి సంవత్సరం తిరువాడిపురం శాత్తుమొర ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తోంది.

శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు…

ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పురుశైవారి తోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొరను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జీయర్ స్వాములు ప్రత్యేక ప్రార్థనలు చేసి అమ్మవారికి నివేదనలు సమర్పించారు.

సాయంత్రం వేళల్లో స్వామివారి ఊరేగింపు…

సాయంత్రం శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ పూర్తయిన అనంతరం, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు పురుశైవారి తోటకు వేంచేసారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు వివిద రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి ఆలయానికి బయల్దేరారు.

మార్గమధ్యంలో ప్రత్యేక పూజలు…

ఊరేగింపు మార్గమధ్యంలో ఉన్న పవిత్ర పొగడ చెట్టు వద్ద స్వామివారికి విశేషంగా హారతి ఇచ్చి, పుష్పమాలలతో పాటు శఠారిని సమర్పించారు. అనంతరం శఠారికి పవిత్ర అభిషేకం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం పూర్తయిన తర్వాత, స్వామివారు మరియు అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా వైభవంగా ఊరేగుతూ తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe