తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
డిసెంబర్ 23వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో డిసెంబర్ 23న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 22వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
పకడ్బందీగా ఏర్పాట్లు:
- గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టనున్నారు.
- వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది.
- టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలకు రావొచ్చు.
- వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు.
- వైకుంఠ ఏకాదశి ముందురోజు సాయంత్రం నుండి భక్తులకు అన్న పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్న ప్రసాద విభాగం అధికారులను ఆదేశించారు.
- భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచనున్నారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.