విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. మరో ప్రొఫెసర్ వీడియో రికార్డింగ్!

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక దాడి కేసుపై హోం మంత్రి అనిత స్పందించారు. విద్యార్థికి న్యాయం చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

Published on: Dec 08, 2025 4:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక దాడి కేసుపై హోం మంత్రి అని మాట్లాడారు. తిరుపతి ఎస్పీ, పోలీస్ ఉన్నతాథికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు. తిరుపతి ఎస్పీ పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కోసం ఒడిశాకు కూడా పోలీసులు బృందం వెళ్లిందన్నారు. విద్యార్థికి న్యాయం చేస్తామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణే మా లక్ష్యం అని హోం మంత్రి అనిత తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కేసులో ఒడిశాకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో బి.ఎడ్ చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించి గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఫోన్లో రికార్డు కూడా చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా తనను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడని కూడా విద్యార్థిని చెప్పుకొచ్చింది.

విద్యార్థిని తన లిఖితపూర్వక ఫిర్యాదులో తనను నిరంతరం ప్రొఫెసర్లు లైంగిక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఆమె నవంబర్ 24న వర్సిటీ లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి, హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు సమర్పించింది. సాక్ష్యంగా వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లను కూడా ఇచ్చింది. తన తల్లిదండ్రులకు తన పరిస్థితి తెలిసిందని, చదువును ఆపివేసి రమ్మన్నారని చెప్పింది. ఆ ఇద్దరు అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేసి, టీసీ అడిగి స్వస్థలానికి తిరిగి వెళ్లింది.

విచారణ నిర్వహించడానికి విశ్వవిద్యాలయం నలుగురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఫిర్యాదును దర్యాప్తు కోసం పోలీసులకు నివేదించాలని సిఫార్సు చేసింది. ఆ కమిటీ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. వర్సిటీ వీసీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి పోలీసులు లక్ష్మణ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటికే లక్ష్మణ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించింది.

పోలీసులు వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు దీనిపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి.. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌లకు అత్యవసర జోక్యం కోరుతూ లేఖ రాశారు. విద్యార్థి తీవ్రంగా మానసికంగా సమస్యను ఎదుర్కొన్నట్టుగా పేర్కొన్నారు. ఒడిశాలోని కోరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన బాధితురాలికి న్యాయం చేయాలన్నారు.