TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి 18న మే నెల కోటా ఆర్జిత సేవా టికెట్ల విడుదల

2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాల గురించి ప్రకటన విడుదల చేసింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తుందో వెల్లడించింది.

Updated on: Feb 16, 2026 5:52 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన 2026 మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాలి. తర్వాత వారికి టికెట్లు మంజూరవుతాయి.

ఫిబ్రవరి 18న మే నెల కోటా ఆర్జిత సేవా టికెట్ల విడుదల (TTD)
ఫిబ్రవరి 18న మే నెల కోటా ఆర్జిత సేవా టికెట్ల విడుదల (TTD)

21న ఆర్జిత సేవా టికెట్లు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల అవుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని ఈ మేరకు టీటీడీ ప్రకటించింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.