టీటీడీ : దేశవ్యాప్తంగా డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనుంది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాలలో ఏర్పాటు చేయనుంది.
పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్లాన్ చేస్తోంది. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ -76, తెలంగాణ -57, తమిళనాడు– 73, కర్ణాటక– 21, పాండిచ్చేరి– 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.
12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడిందని టీటీడీ ప్రకటనలో తెలిపింది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారని టీటీడీ వెల్లడించింది. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకొని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పాట్నాలో టీటీడీ ఆలయం
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్, ఐ.ఏ.ఎస్., ఈ మేరకు టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. సదరు స్థలంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు.














