Tirumala Brahmotsavam 2026 Updates : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏడుకొండల మీదకు వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం, సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా తిరుమల పరిధిలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత లోపిస్తే అస్సలు సహించేది లేదని స్పష్టం చేస్తూ…. ప్రతి మంగళవారాన్ని "క్లీనింగ్ డే"గా పాటించాలని ప్రకటించారు.
ఫిర్యాదుల వెల్లువతో రంగంలోకి టీటీడీ

గత కొన్ని రోజులుగా తిరుమలలోని పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద పారిశుధ్యం సరిగా ఉండటం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం విక్రయిస్తున్నారని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ ఈవో సోమన్నారాయణ… ఆరోగ్య శాఖ అధికారులను తక్షణ చర్యలకు ఆదేశించారు. వారం పొడవునా వ్యాపారాలు సాగించే దుకాణాల్లో వ్యర్థాలు, మురికి పేరుకుపోకుండా ఉండేందుకే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు.
నూతన నిబంధనల ప్రకారం తిరుమలలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ వ్యాపారాలను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ ఆరు గంటల వ్యవధిలో షాపులతో పాటు వాటి చుట్టుపక్కల ప్రాంగణాన్ని సంపూర్ణంగా కడిగి, శుభ్రం చేసుకోవాలి.
ఈ నిర్ణయంలో భాగంగా మంగళవారం తిరుమలలోని మూడో సత్రం, పీఏసీ-1 (పిల్గ్రిమ్ ఎమెనిటీస్ కాంప్లెక్స్), పీఏసీ-2 సహా పలు కీలక ప్రాంతాల్లోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిబ్బంది స్వయంగా రంగంలోకి దిగి దుకాణ ప్రాంగణాలను శుభ్రం చేశారు.
పరిశుభ్రత విషయంలో ఆరోగ్యశాఖ అధికారులు వ్యాపారులకు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు వంటివి లేకుండా ఎప్పటికప్పుడు పేస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయం జరిగే ప్రాంతాలు అత్యంత శుభ్రంగా ఉండాలని ఆదేశించారు.
భక్తుల ఆరోగ్యంతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని…. ఆహార నాణ్యతలో లోపాలున్నా లేదా అపరిశుభ్రతపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా టీటీడీ నిబంధనల ప్రకారం సదరు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి… పారిశుధ్యం, ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అధికారులు పునరుద్ఘాటించారు.
{{/usCountry}}భక్తుల ఆరోగ్యంతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని…. ఆహార నాణ్యతలో లోపాలున్నా లేదా అపరిశుభ్రతపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా టీటీడీ నిబంధనల ప్రకారం సదరు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి… పారిశుధ్యం, ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అధికారులు పునరుద్ఘాటించారు.
{{/usCountry}}