తిరుమలలో కొత్త ఏడాదిలో జరిగే విశేష పర్వదినాల గురించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు అధికారులు ప్రకటించారు. జనవరి 4న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర, 12న అధ్యయనోత్సవాలు సమాప్తి కార్యక్రమాలను నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
- జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
- జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
- జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
- జనవరి 14న భోగి.
- జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
- జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
- జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
- జనవరి 23న వసంత పంచమి.
- జనవరి 25న రథ సప్తమి.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.
కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.