Tirumala : టీటీడీ కొనుగోళ్ల వ్యవస్థలో ప్రక్షాళన - ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!
టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియ వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నారు. మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. గతంలో ఉన్న విధానాలను చెక్ పెడుతూ… ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసే పనిలో పడింది. పూర్తి పారదర్శకంగా నాణ్యమైన సరకులను సరైన ధరలకు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక సమీకృత డిజిటల్ ప్లాట్ఫాంను అభివృద్ధి చేసింది.

వెండర్, ట్రేడర్ల రిజిస్ట్రేషన్ నుంచి నాణ్యత తనిఖీలు, బిల్లుల చెల్లింపు వరకూ ప్రతి ప్రక్రియనూ ఈ ప్లాట్ఫాం ద్వారానే నిర్వహించనున్నారు. తలనీలాలు, వస్త్రాల్లాంటి టీటీడీ విక్రయించే వస్తువులకు ప్లాట్ఫాంగానూ దీన్నే వినియోగిస్తారు. వస్తువులు, సేవలు సహా టీటీడీ ఏది కొనాలన్నా, విక్రయించాలన్నా ఇకపై ఈ ప్లాట్ఫాం ద్వారానే జరుగుతాయి.
ఇందులో భాగంగా డిజిటల్ ప్రోక్యూర్మెంట్, టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు మరియు టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై అధికారులతో కలిసి చర్చించారు.
ముఖ్యమైన నిర్ణయాలు :
• టీటీడీ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి చూపే సరఫరాదారులు తప్పనిసరిగా పోర్టల్లో ఆన్లైన్ ద్వారా నమోదు కావాలి.
• నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు మరియు నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.
• భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందించబడుతుంది.
• ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించబడతాయి.
• మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
• టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానమవుతాయి.
• డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
• పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
• ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











