కార్తీక బ్రహ్మోత్సవాలు : సూర్యప్రభ వాహనంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. యోగ నారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీ యోగ నారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు అని టీటీడీ పేర్కొంది. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలు 250 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
పాండిచ్చేరి కరైకల్ కు చెందిన 20 మంది కళాకారులు నెమలి డాన్స్, చెన్నై కళా నాట్యాలయానికి చెందిన 28 మంది కళాకారుల కేరళ ఫోక్ డాన్స్, విశాఖపట్నానికి చెందిన నారాయణమూర్తి బృందంలోని 24 మంది కళాకారుల అరకు బింస సాంప్రదాయ గిరిజన నృత్యం, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన సతీష్ బృందం 22 మంది కళాకారుల పేరుని నాట్యం భక్తులను ఆకట్టుకుంది.
తిరుపతికి చెందిన సాయినాథ్ బృందంలోని 24 మంది కళాకారుల డప్పు డాన్స్, రమ్య బృందం మోహిని అట్టం, సత్యనారాయణమూర్తి బృందం సమల్పూరి ఫోక్ డాన్స్, కేరళకు చెందిన సిద్దు పృధ్విరాజ్ బృందం మహిషాసుర మర్దిని, తమిళనాడుకు చెందిన వనజ ఉదయ్ బృందం దినకరా పరివారం భక్తులను ఆకట్టుకుంది. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మూర్తుల వేషధారణలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటాలు ప్రదర్శించి భక్తులను ఆహ్లాదపరిచారు.













