టీటీడీ : జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం.. ఈ సేవలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని జనవరి 16న జరగనుంది. ఈ సందర్భంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.

Updated on: Jan 14, 2026 10:17 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడు అంటే జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మవారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం
జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి విచ్చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు

గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులోభాగంగా సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభంగా ఊరేగింపు నిర్వహించారు. భ‌క్తులు క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించి స్వామి, అమ్మవార్లను ద‌ర్శించుకున్నారు. జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం ఉంటుంది.

ఘనంగా శ్రీ గోదాకల్యాణం

పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 233 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.

ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.