TTD Gunny Bags E Auction : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని వివిధ అనుబంధ ఆలయాల్లో నిత్యం నిర్వహించే కైంకర్యాలు, ప్రసాదాల తయారీకి వేలాది గోనె సంచులను వినియోగిస్తుంటారు. ఇలా ఉపయోగించిన ఖాళీ గోనె సంచులను విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలానికి గాను "రేట్ కాంట్రాక్ట్" ప్రాతిపదికన ఈ గోనె సంచులను విక్రయించనున్నారు. ఇందుకోసం వచ్చే జూలై 31వ తేదీన బహిరంగ ఈ-వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు గురువారం తెలిపారు.
వేలంలో పాల్గొనే విధానం….
ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యాపారులు, వ్యక్తులు, లేదా సంస్థలు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేలం ప్రక్రియలో పాల్గొనాలనుకునేవారు జూలై 30వ తేదీ సాయంత్రంలోగా 'కొనుగోలు' పోర్టల్ ద్వారా రూ.30,000 ప్రాథమిక డిపాజిట్ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఈఎండీ చెల్లించిన వారిని మాత్రమే ఈ-వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
ఈ-వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకోవడానికి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన https://konugolu.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వేలం ప్రక్రియ, ఇతర సాంకేతిక వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. సమాచారం కోసం 0877-2264429 ఫోన్ నంబర్లో గానీ, లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ఐడీ ద్వారా గానీ అధికారులను సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.