...
...
Next Story

ఏపీలో యూఏఈ భారీ పెట్టుబడులు.. ఫుడ్ క్లస్టర్, హార్టికల్చర్ ఎగుమతులపై కీలక ఒప్పందం

రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకు వచ్చింది. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశం జరిగింది.

Published on: Jul 21, 2026, 16:19:45 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగం, ఉద్యానవన (హార్టికల్చర్) పంటల రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఒక భారీ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల కోసం సమగ్రమైన వాల్యూ చైన్ రూపొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.

యూఏఈ-ఏపీ ప్రభుత్వ ఒప్పందం
యూఏఈ-ఏపీ ప్రభుత్వ ఒప్పందం

ఈ ప్రతిపాదిత భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఈ ఏడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' వార్షిక సదస్సులో ప్రారంభమయ్యాయి. ఆ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో ఆహార క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు యూఏఈ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆ నాడు చేసుకున్న ప్రాథమిక అంచనాలకు కొనసాగింపుగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకురావడానికి ఇరు వర్గాలు కీలక అడుగులు వేశాయి.

మామిడి, అరటి, కోకోఈ సమగ్ర విలువ ఆధారిత వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి పలు ప్రధాన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలోని నాణ్యమైన మామిడి రకాలకు గల్ఫ్, ఇతర విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ కల్పించడం లక్ష్యంగా ఉంది. అరటి రవాణా నష్టాలను తగ్గించి, సుదీర్ఘకాలం నిల్వ ఉండేలా కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నారు.

కోకో సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రాసెస్ చేసి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేయడం, ఏపీలోని ఇతర ప్రధాన పండ్లు, కూరగాయలను కూడా ఈ గ్లోబల్ సప్లై చైన్‌కు అనుసంధానించనుంది ప్రభుత్వం.

ఆహార శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్, రవాణా రంగాలలో వేలాది మంది యువతకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్‌తో పాటు ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) అధికారులు పాల్గొన్నారు. యూఏఈ ప్రతినిధి బృందంతో కలిసి ప్రాజెక్టు అమలు, భూ కేటాయింపులు, రవాణా సౌకర్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ రోడ్‌మ్యాప్‌పై సమగ్రంగా చర్చించారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, ప్రత్యేకించి వ్యవసాయ, ఉద్యానవన రంగానికి ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe