సంతాన భాగ్యాన్ని ప్రసాదించే వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆ క్షేత్ర విశేషాలు ఇవే!

సంతాన భాగ్యాన్ని ప్రసాదించే తిరుపతి కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆలయం విశిష్టత తెలుసుకోండి.

Published on: Jun 6, 2026, 11:48:48 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతి కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా, సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రంగా విశేష ఖ్యాతి పొందింది. ఈ పవిత్ర ఆలయంలో జూన్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

వేణుగోపాల స్వామి ఆలయం
వేణుగోపాల స్వామి ఆలయం

బ్రహ్మోత్సవాలకు ముందు శాస్త్రోక్తంగా జూన్ 5న సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అనంతరం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.30 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తోమాల, కొలువు, మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.

సుమారు 5.15 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన 16 ఎకరాల స్కంద పుష్కరిణి ఈ క్షేత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. చోళుల కాలం నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. సుమారు 400 ఏళ్ల క్రితం కార్వేటినగర రాజవంశీయుడు వెంకటపెరుమాళ్ రాజు ఆలయాన్ని పునర్నిర్మించారు. వేణువు ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవుతో, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో దర్శనమిచ్చే స్వామివారి దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు విశేష ప్రాధాన్యం కలిగినవి. శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు తోరణంతో సహా ఏకశిలలో చెక్కబడటం ఈ క్షేత్ర వైభవాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ సారంగపాణి ఈ క్షేత్రాధిదేవుడైన శ్రీ వేణుగోపాలస్వామిపై 200కు పైగా భక్తి కీర్తనలు రచించడం విశేషం. 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం 1989 ఏప్రిల్ 10న టీటీడీలో విలీనమైంది. అప్పటి నుండి టీటీడీ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది.

ప్రతిరోజూ నవనీతం, పెరుగన్నం, కట్టె పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు తదితర ప్రత్యేక నైవేద్యాలను స్వామివారికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. పర్వదినాల్లో క్షీరాన్నం, బెల్లం పొంగలి, అప్పం, లడ్డూ, వడ, సుగిలు, బెల్లం దోస వంటి విశేష నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో గృహస్తులు రూ.700 చెల్లించి స్వామి-అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించారు. తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, శ్రీరామనవమి, గోకులాష్టమి, పశువుల పండుగ వంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత.

ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సహకారంతో మధ్యాహ్నం రుచికరమైన ఉచిత అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు.

శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కార్వేటినగర రాజుల పాలన అనంతరం 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 1989 ఏప్రిల్ 10న ఈ ఆలయం టీటీడీలో విలీనం అయింది. టీటీడీ ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత ఆలయ అభివృద్ధికి విశేష ప్రాధాన్యం లభించగా, వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు తదితర ఉత్సవాలు శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, నిత్యకైంకర్యాలు, ఆర్జిత సేవలను క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా ఈ దివ్యక్షేత్రం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More