కేంద్ర బడ్జెట్ 2026 : అరుకులోయపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. పులికాట్ దగ్గర బర్డ్ వాచింగ్ ట్రైల్స్

కేంద్ర బడ్జెట్ 2026లో టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏపీలోని అరకులోయను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Published on: Feb 01, 2026 2:27 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర బడ్జెట్‌లో టూరిజానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరకులోయపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అరకులోయ ట్రెక్కింగ్, ఎకో టూరిజం, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రంగా మార్చనుంది ప్రభుత్వం. అంతేకాదు పులికాట్‌లో పక్షులను చూసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి.

అరకు లోయపై కేంద్రం దృష్టి
అరకు లోయపై కేంద్రం దృష్టి

ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్ అనుభవాన్ని అందించే సామర్థ్యం, అవకాశం భారతదేశానికి ఉందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా పేర్కొంది. పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో పర్వత మార్గాలు, తూర్పు కనుమలలో అరకు లోయ, పశ్చిమ కనుమలలో పోధిగై మలై(తమిళనాడు), ఒడిశా, కర్ణాటక, కేరళలో కీలకమైన తాబేలు ట్రైల్స్, బర్డ్ వాచింగ్ ట్రైల్స్, 15 పురావస్తు ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

అరకు లోయను దేశంలోని ప్రధాన ట్రెక్కింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ అన్నారు. పర్వత దారులను మరింత సురక్షితంగా, పరిరక్షణతో రూపొందిస్తామన్నారు. దీనితో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు భద్రతా, అనుభవపరంగా మెరుగైన సేవలు పొందుతారు. ఈ మేరకు కేంద్రం అరకులో టూరిజాన్ని అభివృద్ధి చేయనుంది. పులికాట్ సరస్సు వెంబడి పక్షులను చూసేందుకు మూడు బర్డ్ వాచింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

గైడ్ నాణ్యత, పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కార్యక్రమాన్ని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో హైబ్రిడ్ మోడ్‌లో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. 12 వారాల శిక్షణా కోర్సు ద్వారా 20 ఐకానిక్ పర్యాటక ప్రదేశాలలో 10,000 మంది గైడ్‌లకు నైపుణ్యం పెంచడానికి ఒక పైలట్ పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.