సాయికృష్ణ మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు.. అక్కడకు వెళ్లమన్నది ఎవరు?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అధికారులు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న క్లూను కూడా వదలడం లేదు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది.

Published on: Jun 21, 2026, 21:13:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు బృందం.. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుసరించిన అక్రమ పద్ధతులపై పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా, మార్కాపురం నుండి విజయవాడ వరకు సాగిన సాయికృష్ణ తరలింపు ఎపిసోడ్‌పై పోలీసులు ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి సారించారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు
సాయికృష్ణ మిస్సింగ్ కేసు

నమ్మలేని నిజాలు ఈ విచారణలో బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ సబ్-ఇన్‌స్పెక్టర్ నవీన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్లినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ఈ బృందం.. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఎక్కడా నమోదు చేయకుండా, ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు సాంకేతిక, క్షేత్రస్థాయి ఆధారాలతో సహా నిర్ధారించారు.

ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ (ADCP) లతాకుమారి, ఎస్ఐ నవీన్‌లతో పాటు పలువురు కానిస్టేబుళ్లను విచారణకు పిలిపించారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై సుదీర్ఘంగా ప్రశ్నించి, స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 24 గంటలకు పైగా నిందితులను, అనుమానితులను విచారించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ విచారణలో ట్రాన్సపోర్టేషన్, మొబైల్ సిగ్నల్స్ వంటి డిజిటల్ ఆధారాలను సేకరించిన పోలీసులు ఒకే ఒక్క ప్రధాన ప్రశ్నపై దృష్టి పెట్టారు. అసలు విజయవాడ పరిధి దాటి అంత దూరం మార్కాపురానికి వెళ్లమని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఇటువంటి ఒత్తిడులు ఏవైనా ఉన్నాయా, లేదా కస్టడీలో ఏదైనా జరిగిందా అనే కోణాన్ని నిరూపించేందుకు లభించిన క్లూస్ టీమ్ నివేదికల ఆధారంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం కేసును లోతుగా తవ్వుతోంది. త్వరలోనే ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈ కేసు విషయంలో గతంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సింగ్ నగర్‌లోని అతని ఇంటిని పోలీసులు దిగ్బంధించారు. దీంతో దర్యాప్తు కీలక దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలువురి వాంగ్మూలాలను నమోదు చేసి, ముఖ్యమైన ఆధారాలను సేకరించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. విచారణ అనంతరం నాగరాజును అరెస్టు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

మే 9న సాయి కృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. అనంతరం అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 29 లోగా సాయి కృష్ణను హాజరుపరచాలని కోర్టు ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులను ఆదేశించింది.

తీవ్రమైన కస్టడీ హింస కారణంగా సాయి కృష్ణ మరణించాడని, సాక్ష్యాలను నాశనం చేయడానికి పోలీసులు అతని మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారని అతని కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More