టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
మరో ఛానల్…!
ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్ లో అందిస్తున్న తరహాలో టిటిడి స్థానిక ఆలయాలు, అనుబంద ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
టీటీడీ అనుబంధ, స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అందులోభాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి, ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్యసేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బడ్జెట్, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు.