వైజాగ్‌లో ఇండియా Vs న్యూజిలాండ్ టీ20 మ్యాచ్.. పార్కింగ్ ఇక్కడ.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా

వైజాగ్‌లో ఇండియా Vs న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌కి అంతా సిద్ధమైంది. మ్యాచ్ రోజు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ నిబంధనలు అమలు చేస్తారు.

Published on: Jan 27, 2026, 09:21:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనవరి 28 బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి వైజాగ్ సిటీ సిద్ధమైంది. దాదాపు 28,000 మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. ఈ మ్యాచ్ సజావుగా జరిగేలా అధికారులు ట్రాఫిక్, పార్కింగ్ ప్రణాళికలతో ఏర్పాట్లను చేశారు. 2026 ఏడాదిలో నగరంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చివరి అంతర్జాతీయ మ్యాచ్ డిసెంబర్ 6, 2025 భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది.

ఇండియా Vs న్యూజిలాండ్ టీ20 (@BCCI)
ఇండియా Vs న్యూజిలాండ్ టీ20 (@BCCI)

సోమవారం సాయంత్రం రెండు జట్లు నగరానికి చేరుకుని మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లు నిర్వహించాయి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ డోంగ్రే పర్యవేక్షణలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పిచ్ తయారీ, ప్రేక్షకుల సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

మ్యాచ్ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ నిబంధనలు అమలు చేస్తారు. స్టేడియం చుట్టూ రద్దీని తగ్గించడానికి టికెట్ కేటగిరీలు, అప్రోచ్ రూట్ల ఆధారంగా నియమించిన పార్కింగ్ జోన్‌లను కేటాయిస్తామని విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా

శ్రీకాకుళం వైపు నుండి వచ్చే వాహనదారులు భారీ, వాణిజ్య వాహనాలు ఆనందపురం వైపు నుండి విశాఖపట్నం నగరంలోకి ప్రవేశించవద్దు. దీనికి బదులుగా నేరుగా జాతీయ రహదారిపై వెళ్ళాలి. ఈ ప్రాంతాల నుండి వచ్చే బస్సులు, ఇతర చిన్న వాణిజ్య వాహనాలు రుషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా బీచ్ రోడ్డు వెంట ప్రయాణించాలి.

పార్కింగ్ జోన్స్

క్రికెట్ మ్యాచ్‌కు హాజరయ్యే వారి కోసం టికెట్ కేటగిరీ, ఎంట్రీ పాయింట్ ద్వారా పలు పార్కింగ్ జోన్‌లను పెట్టారు. VVIP పార్కింగ్ పాస్‌లు ఉన్న వాహనదారులు ఎన్‌హెచ్-16 వెంట స్టేడియానికి ప్రయాణించి గ్రౌండ్ ఏ లోపల పార్క్ చేయాలి. వీఐపీ పార్కింగ్ పాస్‌లు ఉన్నవారు స్టేడియం సమీపంలోని గ్రౌండ్ బీని ఉపయోగించాలి.

విశాఖపట్నం వైపు నుండి వచ్చే ఇతర టిక్కెట్లు ఉన్నవారు ఎన్‌హెచ్-16లోని వైజాగ్ కన్వెన్షన్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే స్టేడియం ముందు ఉన్న హోల్డేజ్ హోమ్ జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిరిగితే ద్విచక్ర వాహనాల కోసం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల మైదానం, కార్ల కోసం ఏఎస్ఆర్ నగర్‌లోని జీవీఎంసీ పార్కులకు చేరుకోవచ్చు.

ఈ రూట్‌లలో వచ్చేవారు..

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది నుంచి వచ్చే వారు కార్‌షెడ్‌ జంక్షన్‌ వద్ద కుడివైపునకు తిరిగి సాంకేతిక కళాశాల పార్కింగ్‌ గ్రౌండ్‌కు వెళ్లాలి. లేదంటే పెప్సీ కటింగ్‌ వద్ద ఎడమవైపు తిరగాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More