Banana Prices : పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఆంధ్రా అరటిపండ్ల ధరలపై ఎఫెక్ట్

Banana Prices : పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆంధ్రా అరటిపండ్ల ధరలపై పడుతున్నాయి. ధరల తగ్గుతుండటంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Mar 9, 2026, 17:36:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో ఘర్షణలు ఆంధ్రా అరటి పండ్ల మీద పడుతోంది. ఘర్షణల నేపథ్యంలో అరటిపండ్ల ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షపాతం, కరువు, మధ్యవర్తుల ప్రభావం వంటి కారణాల వల్ల ఇటీవలి సంవత్సరాలలో అరటి ధరలు విస్తృతంగా హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం గణనీయంగా తగ్గాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నుండి ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇది కాస్త రైతులకు ఉపశమనం కలిగించింది.

అరటి పండ్ల ధరలు
అరటి పండ్ల ధరలు

కానీ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధరలు మరోసారి తగ్గడం ప్రారంభించాయి. ఈ-క్రాప్ డేటా ప్రకారం కడప జిల్లాలో అరటి సాగు దాదాపు 13,820 హెక్టార్లలో విస్తరించి ఉంది.

ఒక ఎకరంలో అరటి పంటను పండించడానికి రైతులు సగటున దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. పంట బాగా వస్తే.. దిగుబడి ఎకరానికి 15 నుండి 20 టన్నుల మధ్య ఉంటుంది. చాలా మంది రైతులు సాధారణంగా ధరలు ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట కోయాలని ప్లాన్ చేస్తారు.

పులివెందుల ప్రాంతంలో పండించే అరటిపండ్లు కోల్‌కతా, ఢిల్లీ, శ్రీనగర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మార్కెట్లకు సరఫరా అవుతాయి. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. కోతకు వచ్చే పంట, కూలీల లభ్యతను బట్టి, రోజుకు దాదాపు 10 నుండి 16 ట్రక్కుల అరటిపండ్లు రవాణా అవుతాయి. ఒక్కో ట్రక్కు దాదాపు 20-25 టన్నులు తీసుకువెళుతుంది.

ఈ పంటను మొదట ట్రక్కు ద్వారా పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు పంపుతారు. అక్కడి నుండి ముంబైకి రవాణా చేస్తారు. ఆ తరువాత గల్ఫ్ దేశాలకు వెళ్తుంది పంట. ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరాలు ఉంటాయి.

పులివెందులలో పండించే అరటిపండ్లు 12 నుండి 14 రోజులు తాజాగా ఉంటాయని చెబుతుంటారు. అయితే వ్యాపారులు పశ్చిమాసియా యుద్ధ భయాలను ఉపయోగించి ధరలను కృత్రిమంగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రెండు నెలలుగా అరటిపండ్ల ధరలు టన్నుకు రూ.18,000 నుంచి రూ.27,000 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్, థర్డ్ గ్రేడ్ అరటిపండ్లు టన్నుకు రూ.10,000 నుంచి రూ.14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ గ్రేడ్ అరటిపండ్లు టన్నుకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ధర పలుకుతున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.

కొంతమంది వ్యాపారులు యుద్ధ భయాలను సాకుగా చేసుకుని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని అధికారులు చెబుతున్నారు. గత నెలలో అరటి ధరలు టన్నుకు రూ. 25,000 నుండి రూ. 27,000 వరకు ఉన్నాయని, కానీ పశ్చిమాసియా యుద్ధం కారణంగా వ్యాపారులు ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నారని అంటున్నారు. అరటి ధరలు పూర్తిగా పడిపోలేదని, మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమేనని పేర్కొన్నారు. యుద్ధ భయాలను ఉపయోగించుకుని ధరలను తగ్గించవద్దని వ్యాపారులకు అధికారులు సూచించారు. త్వరలో ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More