...
...
Next Story

ఎంత ధరనో చెల్లిస్తాం : గీతం భూమి క్రమబద్ధీకరణ వివాదంపై ఎంపీ శ్రీభరత్ కామెంట్స్

విశాఖపట్నంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ గీతం భూముల వ్యవహారంపై కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై గీతం వర్సిటీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందించారు.

Published on: Feb 03, 2026 10:21 AM IST
Advertisement

విశాఖపట్నంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కూడా మాట్లాడారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం నిర్ణయించిన ధరను సంస్థ చెల్లిస్తుందని గీతం విశ్వవిద్యాలయ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ శ్రీభరత్ అన్నారు.

విశాఖ ఎంపీ శ్రీభరత్
విశాఖ ఎంపీ శ్రీభరత్

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ముఖ్యమైన భూమిని తన కుటుంబ సభ్యుడు శ్రీభరత్‌కు అప్పగించారని ఆరోపించారు.

'గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని కంచె వేశారు. కానీ ఇప్పుడు దానిని చంద్రబాబు కుటుంబ సభ్యునికి ఉచితంగా బహుమతిగా ఇస్తున్నారు.' అని వైఎస్ జగన్ అన్నారు.

జనవరి 30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నంలోని గీతం క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై కాంట్రవర్సీ క్రియేట్ అయింది.

ఈ విషయంపై ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు పేర్కొన్న భూమి ధర అతిశయోక్తిగా ఉందన్నారు. క్యాంపస్ సమీపంలోని కొండ ప్రాంతంలోని సుమారు 35 ఎకరాలు మొదట రాజీవ్ స్వగృహ గృహనిర్మాణ ప్రాజెక్టులో భాగమని, ఇది తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు సరసమైన గృహాల కోసం ఉద్దేశించబడిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ వినియోగాన్ని నివాస స్థలం నుండి మిశ్రమ వినియోగంగా మార్చారు. ఆ తర్వాత దానిని ప్లాట్లుగా విభజించి వేలం వేశారన్నారు.

2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గీతం క్యాంపస్ నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న దాదాపు 11 ఎకరాలను ఒక అంతర్జాతీయ పాఠశాలకు ఎకరానికి రూ.1 కోటి చొప్పున కేటాయించిందని టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఆరోపించారు. భూమి నిజంగా ఎకరానికి రూ.100 కోట్ల విలువైనది అయితే , దానిని ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలను శ్రీభరత్ తోసిపుచ్చారు. ఈ ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. 'జీవీఎంసీ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ భూమి ధరను నిర్ణయించదు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ ద్వారా వెళ్ళిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడూ ఉచిత భూమిని కోరలేదు.' అని శ్రీభరత్ స్పష్టం చేశారు.

ఒక కంపెనీకి భూమిని కేటాయించడం, ఆక్రమణకు గురైన భూమిని క్రమబద్ధీకరించడం మధ్య వ్యత్యాసం ఉందని సామాజిక కార్యకర్త వి.వి. రమణ మూర్తి అన్నారు. 'సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడం చట్టవిరుద్ధం. ఆక్రమణ ఎటువంటి చట్టపరమైన హక్కును సృష్టించదు.' అని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe