2026లో ఏపీఎస్ఆర్టీసీకి 2500 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం : ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

ఆర్టీసీలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఈ ఏడాది మొత్తం 2,500 ఎలక్ట్రికల్‌/సీఎన్‌జీ బస్సులు కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

Published on: Feb 02, 2026 5:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఆర్టీసీపై జనాల్లో సంతృప్తి కలిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం 2500 ఎలక్ట్రిక్/సీఎన్జీ బస్సులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

'2026 చివరి వరకు కేంద్రం ఇచ్చే 1050 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కేలా చేస్తాం. కాలం చెల్లిన బస్సులను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తాం. ఆర్టీసీలో కావాల్సిన డైవర్లతోపాటుగా ఇతర నియామకాలు చేపడతాం. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈహెచ్ఎస్‌ను మరింత మెరుగుపరుస్తాం.' అని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు.

సీఎం చంద్రబాబు దృష్టి

ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పల్లె వెలుగు గ్రామీణ సేవలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టనున్న అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఎయిర్ కండిషన్డ్ బస్సులుగా ఉండాలని ముఖ్యమంత్రి . చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల కిందట ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యం, ఆధునిక ప్రజా రవాణాపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరగా టెండర్లను ఆహ్వానించాలని కూడా సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 8,819 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికను చంద్రబాబు ఆమోదించారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని అన్నారు.

2030 నాటికి డీజిల్ వాహనాలను దశలవారీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఇటీవలే అన్నారు. ఈ మార్పు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఏపీఎస్ఆర్టీసీ దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవుట్‌సోర్సింగ్ చేయాలని కూడా చెప్పారు. ఆదాయాన్ని పెంచడానికి భారతీయ రైల్వేల తరహాలో కార్గో రవాణాపై ఎక్కువ దృష్టి పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతిలోనూ ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.