మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - నేటి నుంచే రాకపోకలు
నేటి నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
మేడారం జాతరకు నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

- మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టాండ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు.
- తాత్కాలిక బస్ స్టాండ్ లో 50 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
- 25.76 ఎకరాలల్లో 1000 బస్సులు పార్కింగ్ చేయవచ్చు.
- 10,441 సిబ్బంది విధుల్లో ఉంటారు.
- 76 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా…. కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి.
- మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.
- తాత్కాలిక బస్ స్టాండ్ లో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉంటాయి.
ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి - మంత్రి పొన్నం
తాత్కాలిక బస్ స్టాండ్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. మేడారం జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 ఆర్టీసీ బస్సులను ప్రణాళికబద్ధంగా నడుపుతామని చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా వెంటనే పెంచే విధంగా శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ప్రయాణికులకు రవాణా సేవలతో పాటు భద్రత, ఆరోగ్య సహాయం వంటి అంశాల్లో కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా RTC బస్సులనే వినియోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని, RTC బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం భద్రతాపరంగా మరింత నమ్మదగినదని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్.టి.సి. బస్స్టాండ్ను ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
రూ.7 కోట్ల వ్యయంతో ఏటూరునాగారంలో RTC బస్ డిపోను మంజూరు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలన్నీ సమగ్రంగా కవర్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఏటూరునాగారమే అనుకూల ప్రాంతమని సూచించగా… ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అలాగే మంగపేట, ములుగు తదితర మండలాల్లో మినీ బస్స్టేషన్లను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

