ఏపీ, తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ రోజుల్లో జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో చలి రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.

Published on: Dec 08, 2025 10:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని కొన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. చలి పరిస్థితుల మధ్య అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ తగ్గుదల ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక మండలాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.

పెరుగుతున్న చలి
పెరుగుతున్న చలి

జనాలు విపరీతమైన చలి కారణంగా ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మంటలకు దగ్గరగా ఉంటున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయంపూట ఎటు వెళ్లలేని పరిస్థితి. పొగమంచుతో దారులు సరిగా కనిపించడం లేదు. ఆదివారం జి మాడుగులలో 5.3 డిగ్రీల సెల్సియస్, ముంచింగిపుట్టులో 7.7 డిగ్రీలు, అరకు వ్యాలీలో 8.9, లంబసింగిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లె వద్ద 9.5 డిగ్రీలుగా నమోదైంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం గడ్డకట్టే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం విశాఖ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 17.4 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు చలిగా భావించారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఆదివారం 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.

దిత్వా తుపాను, వర్షపాతం కారణంగా నవంబర్‌లో పర్యాటకుల రాక తగ్గిందని ఏఎస్ఆర్ జిల్లాలోని స్థానికులు తెలిపారు. మళ్లీ పర్యాటక రాక పెరుగుతుందని భావిస్తున్నారు.

అంతకుముందు నవంబర్ 19వ తేదీన చింతపల్లెలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలుగా నమోదైంది. జనవరి 8, 2023లో చింతపల్లెలో 1.5 డిగ్రీల సెల్సియస్‌ని తాకింది. ఉదయం వేళల్లో ప్రయాణికులు ఎటైనా వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కప్పేస్తుంది. రహదారులు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

తెలంగాణలో ఇలా

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 16వ తేదీ దాకా చలి గాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. రాబోయే 7 రోజుల్లో చలిగాలులకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ మధ్య చలిగాలులు ఎక్కువగా ఉంటాయన్నారు. తాజాగా ఉదయంపూట అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.

సంగారెడ్డిలో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అసిఫాబాద్ 6.6, ఆదిలాబాద్ 6.8, వికారాబాద్ 7.8, కామారెడ్డి 8.2, నిజామాబాద్ 8.4, మెదక్ 8.4, రంగారెడ్డి 8.4, సిద్దిపేట 8.9, నిర్మల్ 9.0, సిరిసిల్ల 9.2 ఉష్ణోగ్రతలు ఈ ఉదయం నమోదు అయ్యాయి.

భాగ్యనగరంలోనూ చలి వణికిస్తోంది. శేరిలింగంపల్లి 8.4, రాజేంద్రనగర్ 10.1, అల్వాల్ 10.6, బీహెచ్ఈఎల్ 10.6, ఆర్సీ పురం 12.2, నేరెడ్‌మెట్ 12.4, చందానగర్ 12.4, కంచన్‌భాగ్ 13.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.