Manjeet Kaur Murder: 28 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య- చెట్టుకు కట్టేసి సజీవదహనం- 2 నెలలు పోరాడి మంజీత్ కౌర్ మృతి!

Social Media Influencer Manjeet Kaur Murder: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. కిడ్నాప్ చేసి, చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన అందరిని కలచివేస్తుంది.

Published on: Aug 30, 2026, 10:05:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Social Media Influencer Manjeet Kaur Murder: సోషల్ మీడియాలో నిత్యం చిరునవ్వులతో కనిపించే ఒక యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్యకు గురైంది. రెండు నెలల కిందట జరిగిన ఘోరమైన దాడిలో తీవ్ర గాయాలపాలైన పంజాబ్‌కు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

28 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య- చెట్టుకు కట్టేసి సజీవదహనం- 2 నెలలు పోరాడి మంజీత్ కౌర్ మృతి!
28 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య- చెట్టుకు కట్టేసి సజీవదహనం- 2 నెలలు పోరాడి మంజీత్ కౌర్ మృతి!

చికిత్సత పొందుతూ మృతి

చండీగఢ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్‌ (PGIMER) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న మంజీత్ కౌర్ కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కథనం ఇలా ఉంది.

మద్యం షాప్ వద్ద కిడ్నాప్.. మోరిండా అడవుల్లో రాక్షసత్వం

జులై 3న చండీగఢ్‌లోని సెక్టార్ 34 మద్యం దుకాణం వద్దకు మంజీత్‌ను ఆమెకు తెలిసిన షుభి, పిందా అనే ఇద్దరు వ్యక్తులు పిలిపించారు. అక్కడ ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మోరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై తీవ్రంగా భౌతిక దాడికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా, ఒక రేగు చెట్టుకు కట్టేసి ఒంటిపై నిప్పంటించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఒక స్నేహితుడు దుప్పటితో మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదట మోరిండాలోని ఆస్పత్రికి, ఆ తర్వాత మొహాలీకి, చివరికి జులై 9న చండీగఢ్ పీజీఐఎమ్‌ఈఆర్‌కు మార్చారు.

50 శాతానికిపైగా కాలిన గాయాలు

50 శాతానికి పైగా కాలిన గాయాలతో మంజీత్ కౌర్ వారాల తరబడి స్పృహ లేకుండానే ఆస్పత్రి బెడ్‌పై ఉన్నారు. మంజీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై జులై 28న పంజాబ్‌కు చెందిన మరో ఇన్‌ఫ్లుయెన్సర్ గిల్ మొహాలీ సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశం ఇచ్చారు.

'లైవ్‌లోకి వస్తుంది' అన్న స్నేహితుడు.. నెరవేరని ఆశలు

"మంజీత్ కోలుకుంటోంది. ప్రస్తుతం 50 శాతం కోలుకుంది. మరో 10-15 రోజుల్లో తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలన్నీ చెప్తుంది. దయచేసి ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేయకండి, ఆమె గురించి చెడుగా మాట్లాడకండి" అని గిల్ మొహాలీ వేడుకున్నారు. ఆమె కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ, మంజీత్ లైవ్‌లోకి వచ్చి నిజాలు చెప్పే రోజే రాకుండా పోయింది.

ఏడేళ్ల కుమారుడికి తీరని లోటు

ఆగస్టు 5న మంజీత్‌కు స్వల్పంగా స్పృహ రావడంతో తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. అయితే ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ఆగస్టు 26న ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ల మంజీత్ కౌర్‌కు గతంలోనే విడాకులయ్యాయి. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఆ చిన్నారి పరిస్థితి చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఈ దారుణ ఘటనపై చండీగఢ్ సెక్టార్ 34 పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కిడ్నాప్ (సెక్షన్ 140(1)), హత్య (సెక్షన్ 103(1)), ఉమ్మడి నేరపూరిత బాధ్యత (సెక్షన్ 3(5)) కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ షాదీ లాల్ వెల్లడించారు.

పరారీలో ఉన్న నిందితులు షుభి, పిందా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే నిందితులు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారనే కారణంపై ఇంకా స్పష్టత రాలేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More