Kusha Kapila: సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమే సినిమా ఆఫర్లు, నటుల ఆవేదన సరైనదే: ఇన్‌ఫ్లుయెన్సర్ టు ఓటీటీ నటి కుషా కపిల

Kusha Kapila On Social Media Influencers Vs Actors: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెండితెరపై నటులుగా మారుతుండటం, కేవలం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలోవర్ల సంఖ్యను చూసి అవకాశాలు ఇవ్వడంపై అసలైన నటులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిలో న్యాయం ఉందని ఓటీటీ నటిగా మారిన కుషా కపిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: May 24, 2026, 13:31:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kusha Kapila On Social Media Influencers Vs Actors: డిజిటల్ విప్లవం తర్వాత సినీ రంగంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. కేవలం నటనపైనే ఆధారపడి, థియేటర్ ఆర్ట్స్ లేదా యాక్టింగ్ స్కూల్స్‌లో శిక్షణ తీసుకున్న నటీనటులకు కాకుండా.. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు (Influencers) చిత్ర పరిశ్రమ పెద్దపీట వేస్తోందనే విమర్శలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమే సినిమా ఆఫర్లు, నటుల ఆవేదన సరైనదే: ఇన్‌ఫ్లుయెన్సర్ టు ఓటీటీ నటి కుషా కపిల
సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమే సినిమా ఆఫర్లు, నటుల ఆవేదన సరైనదే: ఇన్‌ఫ్లుయెన్సర్ టు ఓటీటీ నటి కుషా కపిల

డిజిటల్ స్టార్ల వైపే మొగ్గు

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్లకు, రీచ్‌కు పనికొస్తారనే ఆశతో మేకర్స్ కూడా డిజిటల్ స్టార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ వాడి వేడి చర్చపై తాజాగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నుంచి ఓటీటీ నటిగా మారిన కుషా కపిల స్పందించారు.

నటుల ఆవేదనలో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది!

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల ఈ కాస్టింగ్ వివాదంపై ముక్కుసూటిగా మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ఫాలోవర్ల అంకెలను చూసి మాత్రమే పాత్రలను కేటాయిస్తే, ప్రాణం పెట్టి నటనను నమ్ముకున్న వారు బాధపడటంలో ఎలాంటి తప్పులేదని కుషా కపిల స్పష్టం చేశారు.

"కేవలం సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమే సినిమా ఆఫర్లు ఇస్తున్నారని నటులు భావిస్తే.. వారి ఆవేదన సరైనదే. ఎందుకంటే వారు నటనను ఒక కోర్సులా చదువుకుని, కెరీర్‌ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. సినిమా ప్రాజెక్టులను ముందుకు నడిపించాల్సింది, లీడ్ రోల్స్ చేయాల్సింది వారే. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని కుషా కపిల తేల్చి చెప్పారు.

కష్టపడి నటన నేర్చుకుంటే తప్పేంటి?

కేవలం ఫాలోవర్స్ ఉన్నారనే ట్యాగ్‌తోనే కాకుండా.. నటనపై ఇష్టంతో క్రాఫ్ట్ నేర్చుకుని వచ్చే క్రియేటర్లను తక్కువ అంచనా వేయలేమని కుషా అభిప్రాయపడ్డారు. ఒక క్రియేటర్ తన బిజీ షెడ్యూల్ నుంచి సమయం కేటాయించి, యాక్టింగ్ వర్క్‌షాప్‌లకు హాజరవుతూ, నటనను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రసిద్ధ క్రియేటర్ భువన్ బామ్ ఉదాహరణను కుషా కపిల ప్రస్తావించారు. వారు సొంతంగా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ తమ సత్తా నిరూపించుకుంటున్నారని గుర్తుచేశారు. నటుడు ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ వచ్చే ముందు హోమ్ వర్క్ చేయడం, పరిశ్రమపై గౌరవంతో కష్టపడటం ముఖ్యం అని కుషా కపిల పేర్కొన్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ టు ఓటీటీ నటిగా ప్రయాణం

సోషల్ మీడియాలో తనదైన కామెడీ టైమింగ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కుషా కపిల.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హారర్ ఆంథాలజీ 'ఘోస్ట్ స్టోరీస్' ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 'ప్లాన్ ఎ ప్లాన్ బి', 'సెల్ఫీ', 'సుఖీ', 'థాంక్యూ ఫర్ కమింగ్', 'మసాబా మసాబా' వంటి క్రేజీ ఓటీటీ ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఓటీటీ సిరీస్ 'మామ్లా లీగల్ హై సీజన్ 2' (Maamla Legal Hai Season 2) లో లాయర్ నైనా అరోరా పాత్రలో కుషా కపిల నటనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం తనను ప్రేక్షకులు కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కాకుండా ఒక నటిగా గుర్తిస్తున్నారని కుషా ఆనందం వ్యక్తం చేశారు.

నటన పరంగా వంద శాతం సిద్ధం

పెద్ద అవకాశాలు వచ్చేసరికి తనను తాను నటన పరంగా వంద శాతం సిద్ధం చేసుకోవడమే తన లక్ష్యమని, అందుకే కెరీర్‌ను నెమ్మదిగా, పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని తాను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్లు ఓటీటీ బ్యూటీ కుషా కపిల ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More