Panchayat 5 OTT: సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ నుంచి కొత్త సీజన్- కొత్త సవాళ్లతో పంచాయత్ 5- స్ట్రీమింగ్ ఎక్కడో మీకు తెలుసుగా!
Panchayat Season 5 OTT Streaming Details: దేశవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ పంచాయత్ ఐదో సీజన్తో అలరించేందుకు సిద్ధమైంది. మరింత మలుపులు, కొత్త సవాళ్లతో ఫుల్లేరా గ్రామ ప్రజలు నవ్వించేందుకు రెడీ అయ్యారు. పంచాయత్ 5 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో మీకు తెలుసుగా!
Panchayat Season 5 OTT Release Details: ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'పంచాయత్' అభిమానులకు డిజిటల్ వేదికపై అదిరిపోయే వార్త వచ్చేసింది. ఉత్తరప్రదేశ్లోని 'ఫులేరా' అనే ఓ చిన్న పల్లెటూరు నేపథ్యంతో సాగే ఈ పొలిటికల్ సెటైరికల్ కామెడీ డ్రామా సిరీస్ ఐదో సీజన్కు సిద్ధమైంది.

ఓటీటీ సిరీస్ కొత్త చాప్టర్
ఆద్యంతం హాస్యం, గ్రామీణ రాజకీయాలు, భావోద్వేగాల కలయికగా సాగే ఈ ఓటీటీ సిరీస్ కొత్త చాప్టర్ ఈ ఏడాదిలోనే డిజిటల్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈ సిరీస్ హిందీలో రూపొందినప్పటికీ, మన తెలుగు ప్రేక్షకులలోనూ దీనికి విపరీతమైన ఆదరణ ఉంది. డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగు ఇళ్లలో కూడా 'సచివ్ జీ', 'ప్రహ్లాద్ చాచా' పాత్రలు బాగా సుపరిచితమయ్యాయి.
ఈసారి కథలో కొత్త మలుపులు
పంచాయత్ సీజన్ 4 ముగింపులో ఫులేరా గ్రామంలో పెద్ద రాజకీయ మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో సీజన్లో సచివ్ జీ అలియాస్ అభిషేక్ త్రిపాఠికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. పగతో రగిలిపోయే కొత్త నాయకత్వం కింద ఆయన పనిచేయాల్సి వస్తుంది. ఒకవైపు ఎంబీఏ (MBA) చదవాలనే తన కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతూనే, మరోవైపు గ్రామంలో పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించే పనిలో అభిషేక్ పడతాడు.
గత సీజన్లో ఏం జరిగిందంటే?
పంచాయత్ సీజన్ 4లో స్థానిక రాజకీయాలు పీక్స్కు చేరాయి. మంజు దేవి, క్రాంతి దేవి మధ్య జరిగిన హోరాహోరీ ఎన్నికల పోరులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కేవలం 73 ఓట్ల స్వల్ప తేడాతో క్రాంతి దేవి విజయం సాధించడంతో బ్రిజ్ భూషణ్ దూబే కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇటు వ్యక్తిగత జీవితంలో అభిషేక్ త్రిపాఠి క్యాట్ (CAT) పరీక్షలో 97 పర్సంటైల్తో ఉత్తీర్ణుడై ఫులేరాను వదిలి వెళ్లే అవకాశం వచ్చినా, ఊరిపై ఉన్న ప్రేమతో వెనక్కి తగ్గుతాడు. అదే సమయంలో రింకీకి తన మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తాడు.
షూటింగ్ మొదలైంది.. పాత పాత్రలన్నీ రిటర్న్!
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల ఈ సిరీస్ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 3న సెట్స్ నుంచి కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. "ఫులేరాలో ఆరేళ్లు గడిచినా, ఇక్కడి నుంచి వెళ్లాలనిపించడం లేదు" అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.
ఈ ఐదో సీజన్లో జితేంద్ర కుమార్ (సచివ్ జీ), రఘుబీర్ యాదవ్ (బ్రిజ్ భూషణ్), నీనా గుప్తా (మంజు దేవి), ఫైసల్ మాలిక్ (ప్రహ్లాద్ పాండే), చందన్ రాయ్ (వికాస్), శాన్విక (రింకీ) తమ పాత పాత్రల్లో అలరించనున్నారు. వీరితో పాటు 'బనరాకస్' పాత్రలో దుర్గేష్ కుమార్, 'వినోద్' పాత్రలో అశోక్ పాఠక్ కూడా నవ్వించడానికి వస్తున్నారు.
పంచాయత్ 5 ఓటీటీ స్ట్రీమింగ్
ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మిస్తున్న ఈ ఓటీటీ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా, చందన్ కుమార్ కథను అందించారు. ప్రైమ్ వీడియో ఈ ఏడాదే 'సందీప్ భయ్యా', 'గ్రామ్ చికిత్సాలయం' కొత్త సీజన్లను కూడా తీసుకురానుంది. ఇక అమెజాన్ ప్రైమ్లోనే పంచాయత్ సీజన్ 5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ఈ సిరీస్ అభిమానులందరికి తెలిసిందే. కానీ, ఓటీటీ రిలీజ్ డేట్ను ఇంకా ప్రకటించలేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


