Aamir Khan Sai Pallavi: అరుదైన వీడియో-అందరి ముందు అమీర్ ఖాన్ కన్నీళ్లు-యాక్టింగ్ తో ఏడిపించేసిన సాయి పల్లవి-నంబర్ 1 అంటూ

Aamir Khan Sai Pallavi: తన కుమారుడు జునైద్ ఖాన్, నటి సాయి పల్లవి జంటగా నటించిన 'ఏక్ దిన్' సినిమా చూస్తూ అమీర్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. సాయి పల్లవిని దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్ అని కొనియాడారు.

Published on: Apr 27, 2026, 10:28:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aamir Khan Sai Pallavi: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సాధారణంగా సినిమాల విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. అలాంటిది ఒక సినిమా చూస్తూ ఆయన బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, దక్షిణాది స్టార్ నటి సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన 'ఏక్ దిన్' సినిమా కోసం నిర్వహించిన 'ఏక్ దిన్ కీ మెహఫిల్' కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

అమీర్ ఖాన్ ఎమోషనల్
అమీర్ ఖాన్ ఎమోషనల్

అమీర్ కన్నీళ్లు

ఏక్ దిన్ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను వీక్షిస్తున్న సమయంలో అమీర్ ఖాన్ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. తన కళ్ల నుంచి వస్తున్న నీళ్లను టీ-షర్ట్‌తో తుడుచుకుంటూ ఆయన కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే ఉన్న సాయి పల్లవి, జునైద్ ఖాన్ ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఈ చిత్రం అమీర్ మనసును ఎంతగా హత్తుకుందో ఈ దృశ్యాలే చెబుతున్నాయి.

సాయి పల్లవిపై ప్రశంసల వర్షం

ఏక్ దిన్ సినిమా చూసిన అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ సాయి పల్లవి నటనను ఆకాశానికెత్తేశారు. "ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతం. ఆమె పెర్ఫార్మెన్స్ చూసి మీరంతా ఆశ్చర్యపోతారు. నా దృష్టిలో ప్రస్తుతం మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి నంబర్ వన్" అని అమీర్ ప్రశంసించారు. అమీర్ వంటి సీనియర్ నటుడి నుంచి ఇలాంటి మాటలు రావడంతో సాయి పల్లవి ముసిముసి నవ్వులు చిందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

నా కొడుకు కాబట్టి

కుమారుడు జునైద్ నటన గురించి అమీర్ చమత్కరిస్తూ.. "జునైద్ కూడా బాగానే చేశాడు. వాడు నా కొడుకు కాబట్టి నేను ఎక్కువగా చెప్పలేను. కానీ చిత్రంలోని నటీనటులందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. వాళ్ల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని పేర్కొన్నారు. ఇదే వేదికపై అమీర్ ఖాన్ సినిమాలోని టైటిల్ ట్రాక్ పాడి అలరించారు.

ఏక్ దిన్ - ఒక ప్రేమ కావ్యం

సాయి పల్లవికి ఇది బాలీవుడ్ అరంగేట్రం కాగా, జునైద్ ఖాన్‌కు థియేటర్లలో విడుదలవుతున్న రెండో చిత్రం. గతంలో ఆయన నటించిన 'లవ్‌యాపా' ఆశించిన విజయం సాధించలేదు. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందిన 'ఏక్ దిన్' చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మన్సూర్ ఖాన్, అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.

ఈ సినిమా 2016లో విడుదలైన థాయ్ చిత్రం 'వన్ డే'కు అధికారిక రీమేక్. తన సహోద్యోగితో ప్రేమలో పడి, ఆ విషయం చెప్పలేక సతమతమయ్యే ఒక యువకుడి కథ ఇది. కనీసం ఒక్క రోజైనా ఆమెతో గడపాలని అతను కోరుకోవడం, అనూహ్యంగా ఆ కోరిక నెరవేరడం అనే ఆసక్తికర అంశాలతో ఈ రొమాంటిక్ డ్రామా సాగుతుంది.

అమీర్ ప్లాన్

ఏక్ దిన్ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు విడుదల కంటే 39 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఇలాంటి వినూత్న వ్యూహం గురించి అమీర్ స్పందిస్తూ.. "ప్రేక్షకులకు సినిమా చేరువ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ముందుగానే బుకింగ్స్ ప్రారంభించడం వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది" అని వివరించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'ఏక్ దిన్' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

జవాబు: ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న: ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఎవరు?

జవాబు: అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు.

ప్రశ్న: 'ఏక్ దిన్' ఏ సినిమాకు రీమేక్?

జవాబు: ఇది 2016లో వచ్చిన 'వన్ డే' అనే థాయ్ చిత్రానికి అధికారిక రీమేక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More