అది చూసి నా హృదయం పగిలింది, రక్తం మరిగింది- అడివి శేష్ దురంధర్ మూవీ రివ్యూ
అడివి శేష్ 'దురంధర్' సినిమాపై, ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ పై ప్రశంసలు కురిపించాడు. 'మేజర్' సినిమా సమయంలో తన అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన 'దురంధర్' సినిమా ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా నటుడు అడివి శేష్ ఈ సినిమాను 'దేశంలోనే అతిపెద్ద సినిమా'గా అభివర్ణిస్తూ, అందులోని నటీనటులను పొగుడుతూ ట్వీట్ చేశారు. రణవీర్ సింగ్, ఆర్.మాధవన్ 'సూపర్బ్ పెర్ఫార్మెన్సెస్' ఇచ్చారని చెబుతూనే, తనకు మాత్రం అక్షయ్ ఖన్నా ఫేవరెట్ అని తెలిపారు.

అడివి శేష్ దురంధర్ రివ్యూ
టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ సాగిపోతున్న అడివి శేష్ 'దురంధర్' ను ప్రశంసించారు. మూవీ రివ్యూను తన స్టైల్లో పోస్టు చేశారు. ఆదిత్య ధర్ అద్భుతమైన విజయాన్ని సాధించారని కొనియాడారు. "దురంధర్ ను చూసి మురిసిపోయా! దేశంలోనే అతిపెద్ద సినిమాను చూడటానికి ఆలస్యమైనా, ఇది చాలా బాగా తీశారు. ఇంతటి సంబంధిత అంశాన్ని, అనేక సూక్ష్మ నైపుణ్యాలతో చూపించడం మీ ఆదిత్య ధర్ సర్ అద్భుతమైన విజయం. ఇది పూర్తిగా అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన" అని అడివి శేష్ ఎక్స్ లో పోస్టు చేశాడు.
రక్తం మరిగింది
ఇదే సమయంలో తన మేజర్ సినిమా సందర్బంగా అనుభవాలను అడివి శేష్ గుర్తు చేసుకున్నారు. ‘‘మేజర్ సినిమా కోసం 26/11 సంఘటన గురించి ఎంతగానో పరిశోధించిన వ్యక్తిగా, ఐఎస్ఐ హ్యాండ్లర్లు లియారీ అండర్ వరల్డ్ ద్వారా ఎలా శక్తిని పొందారో చూడటం నాకు పూర్తిగా కొత్త అనుభవం. అది చూసినప్పుడు నా హృదయం ముక్కలైంది, నా రక్తం మరిగిపోయింది" అని అడివి శేష్ పోస్టులో యాడ్ చేశారు.
నా ఫేవరెట్ వాళ్లే
అడివి శేష్ 'దురంధర్' కాస్ట్ ను అభినందించారు. "నటీనటులందరూ రణ్ వీర్ నుంచి మాదవన్ వరకూ అందరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. నా ఫేవరెట్ ఖచ్చితంగా రెహ్మాన్ దకైట్ గా అద్భుతంగా నటించిన అక్షయ్ ఖన్నా జీ, జమాల్ గా నటించిన రాకేష్ బేడి జి. అసాధారణమైన సంగీతం, అంతర్జాతీయ సినిమాటోగ్రఫీ, మొత్తం క్రాఫ్ట్ ఒక మరపురాని అనుభూతిని అందించాయి. నేను త్వరలో మళ్ళీ మూవీ చూస్తా" అని అడివి శేష్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
దురంధర్ గురించి
దురంధర్ సినిమాలో కందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భూగోళ రాజకీయ, తీవ్రవాద సంఘటనల నేపథ్యంలో రహస్య గూఢచార కార్యకలాపాలను వివరిస్తుంది. ఇది డిసెంబర్ 5న విడుదలై, దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే రూ.330 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ చిత్రంలో రణవీర్ సింగ్ అండర్ కవర్ గూఢచారి హమ్జా అలీ మజారిగా, ఆర్. మాధవన్ భారత గూఢచార సంస్థ అధిపతి అజయ్ సన్యాల్ గా, సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అసలం గా, అక్షయ్ ఖన్నా నిజ జీవిత గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ దకైట్ గా, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ గా నటించారు.














