Allu Arjun: అల్లు అర్జున్.. ఈ డైరెక్టర్లు ఎక్కడ.. నీ వాల్ ఆఫ్ గ్రేట్స్లో వాళ్లకు చోటివ్వవా: అల్లు సినిమాస్పై విమర్శలు
Allu Arjun: అల్లు అర్జున్ తాజాగా లాంచ్ చేసిన అల్లు సినిమాస్ పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇందులో ఉన్న వాల్ ఆఫ్ గ్రేట్స్ లో కొందరు గొప్ప డైరెక్టర్లు లేకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక బిజినెస్ వెంచర్ 'అల్లు సినిమాస్' (Allu Cinemas) గురువారం (మార్చి 12) సాయంత్రం హైదరాబాద్లోని కోకాపేటలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమా హాల్ను ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే ఈ థియేటర్ లోని ఒక ప్రత్యేక విభాగం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.

ఏమిటీ 'వాల్ ఆఫ్ గ్రేట్స్' వివాదం?
అల్లు సినిమాస్ ఇంటీరియర్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. థియేటర్ లోపల ఒక పొడవైన హాల్వేలో భారతీయ, అంతర్జాతీయ దిగ్గజ దర్శకుల ఫోటోలను ప్రదర్శించారు. దీనికి 'వాల్ ఆఫ్ గ్రేట్స్' (Wall of Greats) అని పేరు పెట్టారు.
ఈ గోడపై చోటు దక్కించుకున్న వాళ్లలో.. ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, వెట్రిమారన్, అట్లీ, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, లిజో జోస్ పెల్లిస్సెరీ, రాజ్కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు.
మరి వీళ్లెక్కడ అంటూ నెటిజన్ల ఆగ్రహం
ఈ ఫోటో గ్యాలరీలో ప్రస్తుత తరం దర్శకులకు ప్రాధాన్యత ఇచ్చి, తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన దిగ్గజాలను విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
"కె.వి. రెడ్డి, విఠలాచార్య, సింగీతం శ్రీనివాసరావు, బాపు, రాఘవేంద్రరావు, జంధ్యాల, దాసరి నారాయణరావు వంటి మహామహుల ఫోటోలు ఉంటే బాగుండేది" అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్స్ అయిన రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ వంటి వారిని ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తున్నారు. "కృష్ణవంశీ ఫోటో ఎక్కడ?" అని మరికొందరు నిలదీస్తున్నారు.
"అట్లీ ఉన్నాడు కానీ, ఆయన గురువు శంకర్ లేకపోవడం విడ్డూరంగా ఉంది" అని తమిళ సినీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కన్నడ నుండి ఉపేంద్ర వంటి వారిని కాదని.. నీల్, రిషబ్ శెట్టిలను మాత్రమే తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీనిని సమర్థిస్తున్నారు. "ఇది అల్లు అర్జున్ పని చేసిన దర్శకులు లేదా ఆయన పని చేయాలనుకుంటున్న దర్శకుల జాబితా మాత్రమే అయి ఉంటుంది" అని వారు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఈ ప్రారంభోత్సవ వేడుకలో అల్లు అర్జున్, అతని భార్య స్నేహ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఎదుగుదలను అభినందించారు. బన్నీ ఇకపై హాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించాలని, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












