సినీ నటుడు మోహన్‌బాబుకు షాక్ - స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరణ

SFI విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు  ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Published on: Feb 18, 2026 1:34 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ప్రశ్నించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసినట్లు నమోదైన కేసులో నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

మంచు మోహన్ బాబు
మంచు మోహన్ బాబు

తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని, అలాగే విచారణ పూర్తయ్యే వరకు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో అరెస్ట్ నుంచి ఎటువంటి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రధాన పిటిషన్ పై లోతైన విచారణ జరుపుతామంటూ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మార్చి 3కు వాయిదా వేశారు.

అసలు కేసు ఏంటి..?

ఈనెల 3వ తేదీన మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూళ్లపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు SFI విద్యార్థి సంఘం నాయకులు వెళ్తారు. ఈ క్రమంలో అక్బర్, వినోద్‌ అనే నాయకులు కిడ్నాప్‌నకు గురయ్యారు . అయితే వీరిని నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో యూనివర్శిటీ ఛాన్స్‌లర్‌ గా ఉన్న మోహన్ బాబును ఏ3 గా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పీఆర్వో సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.

క్వాష్ పిటిషన్ విచారణలో భాగంగా…. ఘటన జరిగిన రోజున తాను తిరుపతిలో లేనని మోహన్ బాబు బోర్డింగ్ పాస్‌లను కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు మోహన్ బాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసులు మాత్రం ఆయన ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు.కిడ్నాప్‌నకు ముందు, తర్వాత వర్సిటీ పీఆర్వో సతీష్‌తో మోహన్‌బాబు మాట్లాడారని, సందేశాలు కూడా పంపారని పోలీసులు చెబుతున్నారు.

ఇరువైపు వాదనలు విన్న ఏపీ హైకోర్టు…. ఈ వ్యవహారంలో ప్రధాన వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీంతో తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. తాజా తీర్పుతో ఈ కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.