సినిమా టైటిల్, స్టోరీతో సహా నా నవల నుంచే కాపీ కొట్టారు..: జాన్వీ కపూర్ మూవీపై కోర్టుకెక్కిన రచయిత్రి

ఇండియా నుంచి ఆస్కార్స్‌కు నామినేట్ అయిన జాన్వీ కపూర్ మూవీ హోమ్‌బౌండ్ పై రచయిత్రి పూజా చంగోయివాలా కోర్టుకెక్కారు. ఈ సినిమా టైటిల్, స్టోరీ మొత్తం అదే పేరుతో ఉన్న తన నవల నుంచే కాపీ కొట్టారని ఆమె ఆరోపించడం గమనార్హం.

Published on: Dec 23, 2025, 18:55:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచిన 'హోమ్‌బౌండ్' (Homebound) సినిమాపై కాపీరైట్ వివాదం చెలరేగింది. జర్నలిస్ట్, రచయిత్రి పూజా చంగోయివాలా తన నవలను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, అలాగే నెట్‌ఫ్లిక్స్‌పై న్యాయపోరాటానికి దిగారు. బాంబే హైకోర్టులో దావా వేయడానికి ఆమె సిద్ధమయ్యారు.

సినిమా టైటిల్, స్టోరీతో సహా నా నవల నుంచే కాపీ కొట్టారు..: జాన్వీ కపూర్ మూవీపై కోర్టుకెక్కిన రచయిత్రి (REUTERS)
సినిమా టైటిల్, స్టోరీతో సహా నా నవల నుంచే కాపీ కొట్టారు..: జాన్వీ కపూర్ మూవీపై కోర్టుకెక్కిన రచయిత్రి (REUTERS)

చిక్కుల్లో హోమ్‌బౌండ్

ఇండియా తరఫున 98వ ఆకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్)కు అధికారిక ఎంట్రీగా వెళ్ళిన 'హోమ్‌బౌండ్' మూవీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన ఈ సినిమా కథ చోరీ చేసిందంటూ రచయిత్రి పూజా చంగోయివాలా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మేకర్స్ కు తాను లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు తెలిపారు.

అసలు వివాదం ఏంటి?

పూజా చంగోయివాలా 2021లో 'హోమ్‌బౌండ్' పేరుతోనే ఒక నవలను ప్రచురించారు. ఇప్పుడు అదే పేరుతో వచ్చిన సినిమా కూడా తన నవల ఆధారంగానే ఉందని ఆమె వాదిస్తున్నారు.

"సినిమా చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నిర్మాతలు నా పుస్తకం టైటిల్‌ను వాడటమే కాకుండా.. సెకండాఫ్‌లోని అనేక సన్నివేశాలు, డైలాగులు, కథనం యధాతధంగా నా నవల నుంచే కాపీ కొట్టారు" అని పూజా హిందుస్తాన్ టైమ్స్‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

అయితే చిత్రబృందం మాత్రం ఈ కథ 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో బషారత్ పీర్ రాసిన ఒక ఆర్టికల్ (A Friendship, a Pandemic and a Death Beside the Highway) ఆధారంగా రాసుకున్నామని చెబుతోంది.

లీగల్ యాక్షన్

పూజా అక్టోబర్ 15నే ధర్మ ప్రొడక్షన్స్ కు లీగల్ నోటీసు పంపారు. సీన్-టు-సీన్ ఎక్కడ కాపీ కొట్టారో వివరించారు. కానీ నిర్మాతలు ఆ ఆరోపణలను ఖండించారు. దీంతో పూజా ఇప్పుడు బాంబే హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పిటిషన్ వేశారు.

సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని, టైటిల్ మార్చాలని, కాపీరైట్ ఉల్లంఘన కింద తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరుతున్నారు. "పెద్ద నిర్మాణ సంస్థలతో పోరాడుతున్నానని నాకు తెలుసు.. కానీ రచయితల హక్కుల కోసం ఇది తప్పదు" అని ఆమె అన్నారు.

ధర్మ ప్రొడక్షన్స్ రియాక్షన్

దీనిపై హోమ్‌బౌండ్ సినిమాను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ స్పందిస్తూ.. "మేము చట్టపరంగానే దీనికి సమాధానం ఇస్తాం. ప్రస్తుతం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేము" అని క్లుప్తంగా బదులిచ్చింది.

కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలు, వారి ప్రయాణం చుట్టూ ఈ సినిమా, నవల రెండూ తిరుగుతాయి. ఈ సినిమాను ఆస్కార్స్ కు పంపించగా.. అక్కడ కూడా షార్ట్‌లిస్ట్ అయింది. అలాంటి మూవీపై ఇప్పుడు కాపీరైట్ ఆరోపణలు రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More