Bhagyashree on Romance: బోల్డ్ గా ఉండొచ్చు కానీ అసహ్యంగా కాదు.. సినిమాల్లో అనవసరమైన రొమాన్స్ పై భాగ్యశ్రీ ఘాటు వ్యాఖ్యలు
Bhagyashree on Romance: 90ల నాటి బాలీవుడ్ అందాల తార భాగ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అనవసరమైన శృంగార సన్నివేశాలపై ఫైర్ అయింది. బోల్డ్ గా ఉండొచ్చు కానీ అసహ్యంగా ఉండకూడదని తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'మైనే ప్యార్ కియా' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసి, రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్న నటి భాగ్యశ్రీ. అయితే ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ లో అతని తల్లి క్యారెక్టర్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాల్లోని అనవసరమైన రొమాన్స్ పై ఆమె ఫైర్ అయ్యారు.

భాగ్యశ్రీ కామెంట్లు
వెరైటీ ఇండియాకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో 90ల నాటి సినిమా, ప్రస్తుత చిత్రాలకు ఉన్న తేడాల గురించి భాగ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. "సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 1990లలో కుటుంబమంతా కలిసి సమయం గడపడానికి ఏకైక వినోదం, ఏకైక మార్గం సినిమా. ఈ రోజు కుటుంబాలు చిన్నవి అయిపోయాయి. ప్రజలు మరింత ఒంటరిగా మిగిలిపోతున్నారు. సృజనాత్మక కళలకు అనేక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి’’ అని భాగ్యశ్రీ తెలిపింది.
రొమాన్స్ ఎందుకు?
‘‘వివిధ రకాల ఆడియన్స్ ను ఇప్పుడు ఇంప్రెస్ చేయడం కష్టమైపోయింది. క్లిక్లు, జానర్లు, ఇండీ, ఆర్ట్ ఫిల్మ్లుగా సినిమాలను విభజిస్తున్నారు. ఇప్పుడంతా కొత్తగా అయిపోయింది. పిల్లలు, తల్లిదండ్రులు కూర్చుని సినిమాలు చూడలేని పరిస్థితి ఉంది. ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టే రొమాన్స్ ఎందుకు? ఆ శృంగార సీన్లు ఎందుకు? ఇంటిమెసీ ఎక్కువ అయిపోయింది. కథలను బోల్డ్ గా చెప్పొచ్చు. మరీ అసహ్యంగా కాదు’’ అని భాగ్యశ్రీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మేల్ డామినెన్స్
‘‘90వ దశకంలో కథలు ఎక్కువగా మేల్ డామినెన్స్ చుట్టూ తిరిగాయి. వివాహం తర్వాత మహిళా నటీమణులకు అవకాశాలు వచ్చేవి కావు. ఉద్యోగాలు చేసే మహిళలను కొత్తగా చూడటం ఇప్పటికీ సమాజంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. పెళ్లి తర్వాత కూడా మహిళలు పనిచేసేలా ప్రోత్సహించే మగాళ్లకు నా అభినందనలు’’ అని భాగ్యశ్రీ తెలిపింది.
భాగ్యశ్రీ గురించి...
భాగ్యశ్రీ 1989లో 'మైనే ప్యార్ కియా'తో అరంగేట్రం చేసి, రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత 'పాయల్', 'ఘర్ ఆయా మేరా పర్దేసి', 'ఓంకారం' వంటి చిత్రాలలో నటించింది. పర్సనల్ లైఫ్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2003లో 'మా సంతోషి మా'తో బాలీవుడ్లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'తలైవి', 'రాధే శ్యామ్', 'ఛత్రపతి' వంటి చిత్రాలలో నటించింది.
రితేష్ దేశ్ముఖ్ కొత్త సినిమా 'రాజా శివాజీ'లో భాగ్యశ్రీ నటిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జీతేంద్ర జోషి, ఆమోల్ గుప్తే, జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


