ఏఐతో దిగ్గజ దర్శకుడి సినిమా- ఉత్తమ మార్గమన్న రాజ్‌కుమార్ హిరానీ- టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం అంటూ!

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు అడుగులు వేస్తున్నారు. ఏఐని భయంగా కాకుండా ఒక సృజనాత్మక నేస్తంగా భావిస్తున్న ఆయన, త్వరలోనే ఈ సాంకేతికతతో ఒక చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. దీనిపై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Published on: Feb 13, 2026 2:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. కొందరు దీనిని ముప్పుగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్', 'పీకే' వంటి అద్భుత చిత్రాలను అందించిన హిందీ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రెండో కోవకు చెందిన వారు. ఏఐ సాయంతో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఏఐతో దిగ్గజ దర్శకుడి సినిమా- ఉత్తమ మార్గమన్న రాజ్‌కుమార్ హిరానీ- టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం అంటూ!
ఏఐతో దిగ్గజ దర్శకుడి సినిమా- ఉత్తమ మార్గమన్న రాజ్‌కుమార్ హిరానీ- టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం అంటూ!

ఏఐతో స్నేహం చేద్దాం

వెరైటీ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ హిరానీ తన సరికొత్త ఆలోచనలను పంచుకున్నారు. "ఏఐ అనేది నిజంగా ఒక గొప్ప సాధనం. మనం దానితో త్వరగా స్నేహం చేయాలి. సినిమా మొత్తం ఏఐతోనే చేయాలని రూలేమీ లేదు, కానీ గతంలో మనం చేయలేకపోయిన పనులను దీనితో సులభంగా, తక్కువ ఖర్చుతో చేయవచ్చు" అని రాజ్‌కుమార్ హిరానీ వివరించారు.

ఇదొక ఉత్తమ మార్గం

ప్రస్తుతం ఒక మంచి కథ తన దగ్గర ఉందని, దానిని 4 నుంచి 5 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌గా తీస్తానని హిరానీ తెలిపారు. "రాబోయే కొద్ది నెలల్లో దీనిపై పని చేస్తాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదొక ఉత్తమ మార్గం" అని రాజ్‌కుమార్ హిరానీ పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

అయితే, రాజ్‌కుమార్ హిరానీ నిర్ణయంపై ఇంటర్నెట్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు ఆయన ప్రయోగాత్మక ధోరణిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం

"మానవ సృజనాత్మకతను ఏఐ భర్తీ చేయలేదు, చేయకూడదు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "హిరానీ వంటి మేధావి తన ప్రతిభను ఇలా వృథా చేసుకోవడం విచారకరం" అని మరొకరు పేర్కొన్నారు. అయితే, "ఆయన కేవలం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇందులో తప్పేముంది?" అని హిరానీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

వరుస ప్రాజెక్టులతో బిజీ

ఇదిలా ఉంటే, రాజ్‌కుమార్ హిరానీ చివరిగా షారుఖ్ ఖాన్‌తో 'డంకీ' (2023) చిత్రాన్ని తెరకెక్కించారు. అక్రమ వలసల నేపథ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, భావోద్వేగ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో మూవీ

ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి 'భారత చలనచిత్ర పితామహుడు' దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. '3 ఇడియట్స్', 'పీకే' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.