ఏఐతో దిగ్గజ దర్శకుడి సినిమా- ఉత్తమ మార్గమన్న రాజ్కుమార్ హిరానీ- టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం అంటూ!
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు అడుగులు వేస్తున్నారు. ఏఐని భయంగా కాకుండా ఒక సృజనాత్మక నేస్తంగా భావిస్తున్న ఆయన, త్వరలోనే ఈ సాంకేతికతతో ఒక చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. దీనిపై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.
సినిమా రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. కొందరు దీనిని ముప్పుగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్', 'పీకే' వంటి అద్భుత చిత్రాలను అందించిన హిందీ దిగ్గజ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ రెండో కోవకు చెందిన వారు. ఏఐ సాయంతో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఏఐతో స్నేహం చేద్దాం
వెరైటీ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాజ్కుమార్ హిరానీ తన సరికొత్త ఆలోచనలను పంచుకున్నారు. "ఏఐ అనేది నిజంగా ఒక గొప్ప సాధనం. మనం దానితో త్వరగా స్నేహం చేయాలి. సినిమా మొత్తం ఏఐతోనే చేయాలని రూలేమీ లేదు, కానీ గతంలో మనం చేయలేకపోయిన పనులను దీనితో సులభంగా, తక్కువ ఖర్చుతో చేయవచ్చు" అని రాజ్కుమార్ హిరానీ వివరించారు.
ఇదొక ఉత్తమ మార్గం
ప్రస్తుతం ఒక మంచి కథ తన దగ్గర ఉందని, దానిని 4 నుంచి 5 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్గా తీస్తానని హిరానీ తెలిపారు. "రాబోయే కొద్ది నెలల్లో దీనిపై పని చేస్తాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదొక ఉత్తమ మార్గం" అని రాజ్కుమార్ హిరానీ పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
అయితే, రాజ్కుమార్ హిరానీ నిర్ణయంపై ఇంటర్నెట్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు ఆయన ప్రయోగాత్మక ధోరణిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టాలెంట్ వేస్ట్ చేసుకోవడం విచారకరం
"మానవ సృజనాత్మకతను ఏఐ భర్తీ చేయలేదు, చేయకూడదు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "హిరానీ వంటి మేధావి తన ప్రతిభను ఇలా వృథా చేసుకోవడం విచారకరం" అని మరొకరు పేర్కొన్నారు. అయితే, "ఆయన కేవలం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇందులో తప్పేముంది?" అని హిరానీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
వరుస ప్రాజెక్టులతో బిజీ
ఇదిలా ఉంటే, రాజ్కుమార్ హిరానీ చివరిగా షారుఖ్ ఖాన్తో 'డంకీ' (2023) చిత్రాన్ని తెరకెక్కించారు. అక్రమ వలసల నేపథ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, భావోద్వేగ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మిస్టర్ పర్ఫెక్ట్తో మూవీ
ప్రస్తుతం రాజ్కుమార్ హిరానీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్తో కలిసి 'భారత చలనచిత్ర పితామహుడు' దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ను రూపొందించే పనిలో ఉన్నారు. '3 ఇడియట్స్', 'పీకే' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


