బ్రహ్మముడి ఫిబ్రవరి 21 ఎపిసోడ్: దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలం టూర్.. ముంచుకొస్తున్న పెను ముప్పు.. ఇక ముగింపేనా?
బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 21) ఎపిసోడ్ లో దుగ్గిరాల ప్యామిలీ మొత్తాన్ని చంపడానికి రుద్రాణి ప్లాన్ చేస్తుంది. కావ్య తనను చెప్పుతో కొట్టిన అవమానాన్ని భరించలేకపోయిన ఆమె.. రాహుల్, రేఖతో కలిసి ఈ ప్లాన్ వేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 962వ ఎపిసోడ్ రుద్రాణి దారుణాలు మరో స్థాయికి చేరతాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఆస్తిని లాక్కోవడం కాదు.. అసలు ఆ దుగ్గిరాల వంశమే లేకుండా చేయడానికి కుట్ర పన్నుతుంది. శ్రీశైలం టూర్ కు సిద్ధమవుతున్న కుటుంబం పెను ప్రమాదంలో పడబోతోంది.

మంత్రి ఇంటికి రుద్రాణి.. బండ బూతులు తిట్టిన ఫ్యామిలీ
బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 21) ఎపిసోడ్ మంత్రి ఇంటికి రుద్రాణి వచ్చే సీన్ తో మొదలవుతుంది. తమ పాపకు దుర్గ అనే పేరు పెట్టి మంత్రి దంపతులతోపాటు దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో ఆమె అక్కడికి వస్తుంది.
తనను క్షమించమని ప్రాధేయపడుతుంది. కానీ ఇందిరా దేవితోపాటు అక్కడున్న అందరూ ఆమెను బండ బూతులు తిడతారు. అసలు నువ్వు ఆడదానివేనా, మనసుందా.. ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చావంటూ తిడతారు. రుద్రాణి కంటతడి పెడుతూ మరో నాటకానికి తెరతీస్తుంది.
రుద్రాణి బండారం బయటపెట్టిన అప్పు
ఇంతలో అప్పు, కల్యాణ్ అక్కడికి వస్తారు. ఇక నీ నాటకం ఆపు రుద్రాణి అంటూ అప్పు ఎంట్రీ ఇస్తుంది. అసలు దీనంతటికీ కారణం రుద్రాణియే.. పాపను మార్చింది మంత్రిగారే అయినా దాని వెనుక ఉన్నది ఈ ఈమెనే.. మంత్రిగారు నిజం చెప్పకపోవడంతో డిపార్ట్మెంట్ సాయంతో నేను అసలు నిజం తెలుసుకున్నాను..
పాపను చంపాలని చూసింది, మమ్మల్ని కిడ్నాప్ చేయించింది.. ఇప్పుడు యాక్సిడెంట్ లో మమ్మల్ని చంపాలని చూసింది ఈవిడే అని అప్పు చెబుతుంది. తాను మారిపోయానని చెబితే తాను నమ్మి ఆమ పేరు బయట పెట్టలేదని, ఇప్పుడు ఇంత పని చేస్తుందని ఊహించలేదని మంత్రి ధర్మేంద్ర అంటాడు.
పుట్టగతులు ఉండవంటూ తిట్టిన రాజ్
దీంతో అందరి ఆవేశం రెట్టింపవుతుంది. చివరికి రాజ్ కూడా నువ్వు ఆడదానివేనా.. నీకు పుట్టగతులు ఉండవంటూ రుద్రాణిని తిడతాడు. ఇంకా ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది అంటూ నిలదీస్తాడు. అటు సీతారామయ్య కూడా ఓ ఆడపిల్లను పెంచుతున్నామని అనుకున్నాం కానీ.. పాముకు పాలు పోసి పెంచుతున్నామని అనుకోలేదని అంటాడు.
రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య
ఇదంతా వింటూ కావ్య ఆవేశంతో రగిలిపోతుంది. చివరికి అందరి ముందు చెప్పుతో రుద్రాణిని కొడుతుంది. దీంతో ఆమెకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకుంటారు. తన కన్న బిడ్డను చంపాలని చూసినా ఏమీ చేయకుండా వదిలేశామని, ఇప్పుడు వాళ్లను చంపాలని చూస్తావా.. నీకు నా మీద పగ ఉంటే మమ్మల్ని సాధించు.. ఎందుకు వాళ్ల జోలికి వస్తావని అంటుంది.
ఇక నువ్వు ఇక్కడే కాదు ఈ ఊళ్లోనే ఉండకూడదని అందరూ చెబుతారు. ఒకవేళ కనిపిస్తే అక్కడే చంపేస్తామని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. చివరికి రాహుల్ కూడా నాటకం మొదలుపెడతాడు. తల్లిని ఇంటి బయటకు లాక్కెళ్తాడు.
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామన్న రాహుల్, రేఖ
మంత్రి ఇంట్లో జరిగిన అవమానాన్ని, కావ్య చెప్పుతో కొట్టిన సందర్బాన్ని గుర్తు చేసుకొని అవమాన భారంతో రుద్రాణి రగిలిపోతుంది. చివరికి తనను తాను చంపుకోవడానికి కత్తి తీసుకుంటుంది. అప్పుడే రాహుల్, రేఖ ఎంట్రీ ఇస్తారు. బాగుంది మామ్.. మమ్మల్ని ఏదో చేస్తావనుకుంటే ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటున్నావా అని నిలదీస్తారు.
మరి ఏం చేయమంటారు.. ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఇంకా ఏం చేయాలని రుద్రాణి అంటుంది. ఈ అవమానానికి ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలన్న కోపం వస్తోంది అని అనగానే మరి చంపేద్దాం అని రాహుల్, రేఖ కూడా అంటారు. నువ్వు ఆ ప్లాన్ వేస్తుండు.. మేము ఇంట్లో చేయాల్సిన ఓ చివరి డ్రామా ఒకటుంది అని రేఖ అంటుంది.
దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలం టూర్
ఇటు ఇంట్లో రుద్రాణి చేసిన పని తలుచుకొని అందరూ బాధపడుతుంటారు. దానిని వదిలేసి తప్పు చేశామని అనుకుంటారు. కానీ రుద్రాణి ఇవన్నీ చేసినట్లుగా సాక్ష్యాధారాలు లేవు.. అవన్నీ మనసుకు సంబంధించినవే.. కోర్టును నమ్మించే ఆధారాలు కావాలి.. ఎప్పటికప్పుడు ఆ సాక్ష్యాలు లేకుండా ఆమె జాగ్రత్త పడింది అని అప్పు చెబుతుంది. ఇదే సమయంలో తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని రాహుల్, రేఖ కొత్త డ్రామా మొదలుపెడతారు. ఇంత జరిగిన తర్వాత ఇంట్లో ఉండే అర్హత లేదని అంటారు.
అటు దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలానికి వెళ్దామని ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో ఎందుకు అని కావ్య అంటున్నా రాజ్ మాత్రం వెళ్దామంటాడు. ఇదే విషయాన్ని రుద్రాణికి చెబుతుంది రేఖ. అందరినీ ఒకేసారి కైలాసానికి పంపడానికి ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది అని రుద్రాణి అంటుంది. ఆ టూర్లోనే వాళ్లను చంపేద్దామని ప్లాన్ చేస్తుంది. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


