బ్రహ్మముడి మార్చి 4 ఎపిసోడ్: పగటి కలల రాజు.. గొప్ప ఆశయాల ఇందు.. మళ్లీ కలవబోతున్న అప్పటి రాజ్, కావ్య.. రేఖ పని ఖతం!
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మార్చి 4) ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. కన్నుమూసిన రాజ్, కావ్యలాగా ఈ తరంలో రాజు, ఇందు తిరిగి వచ్చారు. వీళ్లు ఎలా కలవబోతున్నారు? రేఖ పని ఎలా పట్టబోతున్నారన్నది ఈ తాజా ఎపిసోడ్ లో వాళ్ల పాత్రల పరిచయం ద్వారా ఆసక్తి రేపారు.
బ్రహ్మముడి సీరియల్ మార్చి 4 ఎపిసోడ్ జనరేషన్ లీప్ తీసుకుంది. రేఖ పెట్టే కష్టాలను భరిస్తూనే ఇందు పెరిగి పెద్దదైంది. పెద్ద చదువులు చదువుతూనే ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తుంటుంది. అయితే తన తల్లి కావ్యలాగే ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయిగా మారడం చూడొచ్చు. తన నాన్నమ్మ, తాతయ్యలకు ఆమె ధైర్యం చెబుతుంది. మరోవైపు డబ్బు కోసం పగటి కలలు కనే రాజు పాత్రను కూడా పరిచయం చేశారు. ఇది చిన్ననాటి స్వరాజ్ పాత్ర కావడం విశేషం.

అచ్చూ కావ్యలా ఇందు
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మార్చి 4) ఎపిసోడ్ ఇందు పరిచయంతో మొదలైంది. ఆమె అచ్చూ తన తల్లి కావ్యలాగే ఉంటుంది. ఇంట్లో పనులు చేస్తూనే చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని తాను చదువుకున్నది రివైజ్ చేస్తూ ఉంటుంది. కిచెన్ లో చకాచకా పనులు చక్కబెడుతూ.. ఇంట్లో వాళ్లకు ఏం కావలంటే అది చేసి ఇస్తుంటుంది. తన పెద్దమ్మ కూతురు స్వాతికి కూడా ఆమె గైడ్ గా ఉంటుంది.
భ్రమరాంబకు ఇందు సేవలు
ఇటు రేఖ వదిన భ్రమరాంబ మాత్రం ఇందుతో సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఇందు ఆస్తినే అనుభవిస్తూ ఆమెపైనే పెత్తనం చెలాయిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే నాలుగైదు రకాల వెజిటబుల్ జ్యూసులు ఆమెతో చేయించుకుంటూ, మళ్లీ ఆమెనే తిడుతూ ఉంటుంది. ఆమె భర్త శేషు భ్రమరాంబపై పంచులేస్తూ ఉంటాడు. ఆమె పెట్టే చిత్ర హింసలను భరిస్తూనే ఎప్పుడూ నవ్వుతూ, తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో కనిపించే ధైర్యవంతురాలిగా ఇందు కనిపిస్తుంది.
అపర్ణ, సుభాష్లకు ధైర్యం చెప్పిన ఇందు
అటు అపర్ణ, సుభాష్ బాగా ముసలి వాళ్లు అయిపోతారు. సుభాష్ చక్రాల కుర్చీకే పరిమితమై బాధపడుతూ ఉంటాడు. అయితే ఇందు వాళ్లలో ధైర్యం నింపుతుంది. వాళ్లను సుబ్బు, అపర్ణ దేవి అంటూ పేర్లు పెట్టి పిలుస్తూ వాళ్లకు సేవలు చేస్తుంది. ఎప్పటికైనా తాను దుగ్గిరాల ఇంటిని తిరిగి నిలబెడతానని అపర్ణ, సుభాష్ లకు హామీ ఇస్తుంది. ఆమెను చూసి చనిపోయిన కావ్యనే గుర్తు చేసుకుంటారు.
ఆమె కూడా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చకుండా ధైర్యంగా ఎదుర్కోవాలనేదని, ఇందు కూడా అలాగే అయిందని అనుకుంటారు. ఇందు వెళ్లిపోయిన తర్వాత రాజ్, కావ్య బతికి ఉంటే ఈపాటికి ఆమె మేనబావ స్వరాజ్ తో ఇందు పెళ్లి గురించి మాట్లాడుకునేవాళ్లని అపర్ణ, సుభాష్ అంటారు.
డబ్బు కోసం పగటి కలలు కనే వ్యక్తిగా రాజు
అప్పుడే రాజు పాత్రను పరిచయం చేస్తారు. చిన్ననాటి స్వరాజ్ ఆ ప్రమాదం తర్వాత గతం మరచిపోయి మరో ఇంట్లో పెరిగి పెద్దవాడై రాజుగా మారతాడు. అప్పటి రాజ్ ఇప్పుడు రాజులా తిరిగి వస్తాడు. అయితే ఈ రాజు డబ్బు కోసం కలలు కంటూ ఏ పనీ చేయకుండా పగటి కలలు కనే వ్యక్తిలా కనిపించడం విశేషం. కలలో డబ్బుతో పరుగెత్తుతున్న అమ్మాయి వెంట పడుతుంటాడు. అప్పుడే అతని పెంచి తండ్రి వచ్చి ఒక్క తన్ను తన్నడంతో మంచం మీది నుంచి కింద పడతాడు.
ఇలా పగటి కలలు కనకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని తిడతాడు. తాను కోటీశ్వరుడిని అవుతానని, కష్టపడకుండానే ఆ పని చేస్తానని రాజు అంటాడు. అతని పెంచిన తల్లి మాత్రం రాజుకు సపోర్ట్ గా ఉంటుంది. బస్తీలో మాస్ అవతారంలో రాజు పెరుగుతాడు.
నీళ్ల ట్యాంకు దగ్గర ఆడాళ్లతో రాజు గొడవ
ఇటు నీళ్ల ట్యాంకు దగ్గర ఆడాళ్లతో రాజు గొడవ పడే సీన్ ఈ ఎపిసోడ్ లో హైలైట్. వాళ్లను నకిలీ డబ్బుతో మాయ చేసి నీళ్లు ట్యాంకు దగ్గర నీళ్లు పట్టుకుంటాడు. అది తెలిసి అందరూ కలిసి అతనిపైకి వెళ్తారు. వాళ్లందరితో రాజు ఫైట్ చేయడం ఫన్నీగా అనిపిస్తుంది.
మరోవైపు ఇంట్లో రుద్రాణి, రాహుల్ ఫొటోలను ఇందు తుడుస్తుండగా.. రుద్రాణి ఫొటో పొరపాటున కింద పడి పగిలిపోతుంది. అది చూసి రేఖ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇందుని కొట్టడానికి చేయెత్తుతుంది. అప్పుడే రేఖ అంటూ అపర్ణ ఆగ్రహంగా ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


