బ్రహ్మముడి నవంబర్ 26 ఎపిసోడ్: బుల్లెట్ బండిపై రాజ్, కావ్య రొమాన్స్.. మరో సాహసం చేస్తున్న అప్పు.. రాహుల్ ప్లాన్ సక్సెస్
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ లో రాహుల్, రుద్రాణి కొత్త కుట్ర తెర తీయగా.. ఇటు రాజ్, కావ్య బుల్లెట్ బండిపై రొమాన్స్ చేస్తారు. అటు ఇంట్లో చెప్పకుండా అప్పు డ్యూటీకి వెళ్తూ మరో సాహసం చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 888వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాహుల్ కు కొత్త కంపెనీ పెట్టించడంపై సీతారామయ్య మందలించడం, రుద్రాణిని ధాన్యలక్ష్మి దెప్పిపొడవడం, బుల్లెట్ బండిపై రాజ్, కావ్య రొమాన్స్ లాంటి సీన్లతో సాగిపోయింది. మొత్తంగా ఏం జరిగిందో చూడండి.

రాజ్, కావ్యలకు సీతారామయ్య క్లాస్..
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ రాజ్, కావ్యలకు స్వప్న, రాజ్ థ్యాంక్స్ చెప్పే సీన్ తో మొదలవుతుంది. గొడవ సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఆ తర్వాత సీతారామయ్య.. రాజ్, కావ్య చేసిన పనికి వాళ్లకు క్లాస్ పీకుతాడు. మీరు చేసిన పని వల్ల ఈ కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఏం జరిగినా తాను అందరూ స్వరాజ్ కంపెనీ చెట్టు నీడనే ఉండాలని అనుకున్నానని, మీ నాన్న, బాబాయ్ అదే చేశారని రాజ్ తో అంటాడు సీతారామయ్య.
తాము కూడా కుటుంబం విచ్ఛిన్నం కావద్దనే రాహుల్ కు ఇలా బాధ్యతలు అప్పగించామని, అలా కాకుండా చూసుకుంటామని రాజ్ చెబుతాడు. తన అక్కకు కూడా తమతో సమానంగా బాధ్యత ఉండాలని అనుకున్నామని కావ్య చెబుతుంది. ఏం చేసినా ఈ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూడాలని, అది జరిగితే తాను తట్టుకోలేనని చెప్పిన సీతారామయ్య వెళ్లిపోతాడు.
రుద్రాణి, ధాన్యలక్ష్మి వాదులాట..
అటు ధాన్యలక్ష్మి రూమ్ లోకి రుద్రాణి వెళ్తుంది. ఆమె నగలు సర్దడం చూసి పది కిలోల బంగారం కొనడానికి ఎంతవుతుంది అని అడుగుతుంది. ఎందుకు అని ధాన్యలక్ష్మి అడిగితే.. తన కొడుకు కొత్త కంపెనీ పెట్టాడని, ఇక తాను కూడా మీ స్థాయిలో ఉంటానని అంటుంది. దీంతో ధాన్యం ఆమెను దెప్పి పొడుస్తుంది.
ఈ వందల కోట్ల ఆస్తికి తన కొడుకు, తన అక్క కొడుకు వారసులు తప్ప.. మీరు కారు.. అందుకే ఏదో చిన్న కంపెనీ పెట్టించారు అంతే.. దానికీ అంతలా ఎగిరిపడకు.. నువ్వు ఆ స్థాయికి ఎదగలేవు.. ఈ ఆస్తిలో వాటా అడగడానికి నీకు, నీ కొడుక్కి హక్కు కూడా లేదుగా అని ధాన్యలక్ష్మి దెప్పిపొడుస్తుంది. దీంతో రుద్రాణి ఉడుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రుద్రాణితో కలిసి రాహుల్ కొత్త కుట్ర..
అటు తన గదిలోకి వెళ్లగానే రాహుల్ తల్లిని పట్టుకొని తాను సాధించానని సంతోషిస్తాడు. ఈ మాత్రం దానికే అంత ఆనంద పడాలా.. వందల కోట్ల ఆస్తిలో నీకు ఇచ్చింది రూ.20 కోట్లే కదా.. ఈ ఆస్తిలో మనకేమీ వాటా లేదని ఆ ధాన్యలక్ష్మి దెప్పి పొడుస్తోంది అని రాహుల్ తో రుద్రాణి అంటుంది.
దీనికి రాహుల్ స్పందిస్తూ.. తన ఆర్ కంపెనీతో మెల్లగా స్వరాజ్ కంపెనీని మొత్తం లాగేసుకుంటాను.. ఈ ఫ్యామిలీ నెత్తిమీద ఎక్కి కూర్చుంటాను.. దొంగ చేతికే వాళ్లు తాళాలు ఇచ్చారు అని రాహుల్ చెప్పడంతో నిజంగా అలా చేస్తావా అని రుద్రాణి అడుగుతుంది. తన లక్ష్యం అదే అని, మనం కోటీశ్వరులం అవుతామని రాహుల్ హామీ ఇస్తాడు.
కావ్య కోసం రాజ్ బుల్లెట్ బండి.. నడిపి టార్చర్ పెట్టిన కావ్య
మరోవైపు కావ్య బకెట్ లిస్ట్ లో చివరి కోరిక అయిన బుల్లెట్ బండి తీసుకొస్తాడు రాజ్. దానిపై ఎక్కి కావ్య తెగ మురిసిపోతుంది. ఎన్నో పోజులు ఇస్తూ ఫొటోలు దిగుతుంది. ఆ తర్వాత తన వెనుక కూర్చొని బండి నడపడం నేర్పించాలని కావ్య అంటుంది. దీంతో రాజ్ భయపడతాడు. అయినా బలవంతంగా అతన్ని ఎక్కించుకొని కావ్య చాలా వేగంగా బుల్లెట్ బండిపై దూసుకెళ్తుంది. దీంతో రాజ్ భయంతో ఆమెను గట్టిగా పట్టుకొని కూర్చొంటాడు.
తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నీకు బైకు నడపడం కూడా వచ్చా అని రాజ్ అడిగితే.. తాను ఎప్పుడో అప్పు దగ్గర నేర్చుకున్నానని అంటుంది. అటు ఇంట్లో అంతా సద్దమణగడంతో ఇక నుంచి నువ్వు స్వరాజ్ కంపెనీకి రావద్దని, ఆర్ కంపెనీని చూసుకోవాలని రాహుల్ కు చెబుతాడు సుభాష్. తాను, కావ్య కూడా ఆఫీసుకు వెళ్తామని రాజ్ అంటాడు.
అప్పు కూడా డ్యూటీకి వెళ్తానంటే ధాన్యలక్ష్మి వద్దంటుంది. డెలివరీ అయ్యే వరకు వెళ్లొద్దని చెప్పాను కదా అంటుంది. అయినా అత్తకు తెలియకుండా అప్పూని డ్యూటీకి తీసుకెళ్లడానికి రాజ్, కావ్య, కల్యాణ్ ప్లాన్ చేస్తారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


