CM Revanth Kushita Kallapu: ఓటీటీ హీరోయిన్ చేతికి సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు- కుషిత కల్లపు పోస్టుతో దుమారం!

CM Revanth Reddy SRH Vs CSK IPL Tickets To Kushita Kallapu: ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రోటోకాల్ టికెట్ల పంపిణీలో పెను దుమారం రేగింది. సీఎం రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన అత్యంత ఖరీదైన ఎలైట్ గౌంజ్ పాస్‌లు ఓటీటీ హీరోయిన్ కుషిత కల్లపు చేతిలో ప్రత్యక్షమవడం దుమారం రేపుతోంది.

Published on: Apr 19, 2026, 09:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Revanth Reddy SRH Vs CSK IPL Tickets To Kushita Kallapu: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఎస్‌ఆర్‌హెచ్ (SRH) వర్సెస్ సీఎస్కే (CSK) ఐపీఎల్ మ్యాచ్‌ ఎంత జోరుగా సాగిందో దానికి సంబంధించిన టికెట్స్ సైతం బయట హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌ టికెట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

ఓటీటీ హీరోయిన్ చేతికి సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు- కుషిత కల్లపు పోస్టుతో దుమారం!
ఓటీటీ హీరోయిన్ చేతికి సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు- కుషిత కల్లపు పోస్టుతో దుమారం!

ఒక్కో టికెట్‌కు 40 వేలు

సాధారణంగా ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాస్‌లు పంపిస్తారు. అయితే, ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి పంపిన రెండు టికెట్లు ఊహించని విధంగా ఓటీటీ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు చేతికి చేరాయి.

ఒక్కో టికెట్ విలువ అక్షరాలా రూ. 40,000 అని సమాచారం. ఈ టికెట్లు ఉంటే స్టేడియంలోని అత్యంత విలాసవంతమైన 'సన్‌రైజర్స్ ఎలైట్ లాంజ్'లో కూర్చుని మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న ఐపీఎల్ టికెట్స్ హీరోయిన్ కుషిత కల్లపు చేతికి ఎలా వెళ్లాయనే విషయంపై ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్

అయితే, ఈ టికెట్ల వ్యవహారం బయటపడటానికి కారణం కుషితనే కావడం గమనార్హం. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆ రెండు టికెట్ల ఫోటోలను కుషిత కల్లపు పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆమె పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కుషిత కల్లపు గతంలో ‘చాంగురే బంగారు రాజా’, ‘నీతోనే నేను’, ‘బాబు - నెంబర్ 1 బుల్ షిట్ గయ్’‌తోపాటు ‘3 రోజెస్ సీజన్ 2’, ‘చిరంజీవ’ వంటి ఓటీటీ సినిమాల్లో కూడా నటించింది. సీఎం కార్యాలయానికి (CMO) చేరాల్సిన ఈ పాస్‌లు కుషిత దగ్గరకు ఎలా వెళ్లాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.

రాజకీయ ప్రాధాన్యత వర్సెస్ వ్యక్తిగత ప్రయోజనం

ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేదా స్టేడియం అథారిటీ ఇచ్చే ఈ ప్రోటోకాల్ పాస్‌లు ప్రభుత్వ సమన్వయం, భద్రత లేదా అధికారిక అతిథుల కోసం కేటాయిస్తారు. ఇవి సీఎంఓ సిబ్బందికి లేదా రాజకీయ నేతలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తి కాదు. వీటిని అధికారిక అవసరాలకు కాకుండా, ఇలా స్నేహితులకు లేదా ఇష్టమొచ్చిన వారికి పంపిణీ చేయడం నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వివాదాలకు నిలయంగా మారిన కాంప్లిమెంటరీ టికెట్లు

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్న పాస్‌లు బయట వ్యక్తుల చేతికి వెళ్లడం భద్రతా పరమైన లోపంగా కూడా కొందరు భావిస్తున్నారు. నిజానికి ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపిణీ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ మధ్య టికెట్ల కోటా విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది.

2025లో అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు స్టేడియానికి నీళ్లు, విద్యుత్ సరఫరా ఆపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కె. శ్రీనివాసరెడ్డితో విచారణకు ఆదేశించారు. ఇంతటి సున్నితమైన నేపథ్యంలో, మళ్లీ సీఎం పాస్‌లే దారి తప్పడం చర్చనీయాంశమైంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More